
హైదరాబాద్: ఆప్ఘనిస్థాన్ క్రికెట్ బోర్డులో అవినీతి జరుగుతుందంటూ ఆ జట్టు మాజీ కెప్టెన్ గుల్బాదిన్ నైబ్ వరుస ట్వీట్లతో కలకలం సృష్టించాడు. గవర్నమెంట్ అధికారులు దగ్గర్నుంచీ బోర్డు సభ్యులు, ఆటగాళ్లు, మాజీ బోర్డు మెంబర్లు, మేనేజ్మెంట్ సభ్యుల పేర్లు బయటపెడతానంటూ ట్విట్టర్లో వరుస ట్వీట్లు చేశాడు.
ఈ మేరకు తన ట్విట్టర్లో "డియర్ అఫ్గాన్ ఫ్యాన్స్. నేను పబ్లిక్గా అందరి ముందుకు రావడానికి కారణం ఏ ఒక్కరి మీదో వ్యక్తిగత కక్ష కాదు. క్రికెట్ బోర్డుపై కూడా నాకు ద్వేషం లేదు. బోర్డు సభ్యులు అవినీతిలో కూరుకుపోయారు. వారిపై చర్యలు తీసుకుంటానంటే చెప్పండి, వారి పేర్లు బయటపెడతా" అని ట్వీట్ చేశాడు.
"ఇంతకు ముందు ఈ అవినీతి మాఫియాకు వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడలేదని మీలో చాలామంది నన్ను అడుగుతారని నాకు తెలుసు. అధికారులు మరియు స్టేక్హోల్డర్స్ క్రికెట్ జట్టులో నెలకొన్న గందరగోళాన్ని క్రమబద్ధీకరిస్తామని నాకు వాగ్ధానం చేశారు. వెంటనే చర్యలు తీసుకుంటామని, వారిపై నిషేధం విధిస్తామని నాకు మాటిచ్చారు" అని అన్నాడు.
"నేషనల్ లీగల్ ఏజెన్సీ అవినీతికి పాల్పడుతున్న వారిపై ఏమైనా యాక్షన్ తీసుకుంది. అథారిటీ కూడా ఏమీ యాక్షన్ తీసుకోలేకపోతే నేను వారి పేర్లు బయటకు పెడతా. అప్పుడు సిగ్గు పడతారు. గవర్నమెంట్ అధికారులు దగ్గర్నుంచీ బోర్డు సభ్యులు, ఆటగాళ్లు, మాజీ బోర్డు మెంబర్లు, మేనేజ్మెంట్ సభ్యుల పేర్లు బయటపెడతా. స్టే ట్యూన్డ్" అని వరుస ట్వీట్లలో పేర్కొన్నాడు.
ఇటీవలే ఇంగ్లాండ్ వేదికగా ముగిసిన వన్డే వరల్డ్కప్లో ఆప్ఘనిస్థాన్ జట్టుకు గుల్బాదిన్ నైట్ నాయకత్వం వహించాడు. వరల్డ్కప్కు ముందు అస్గర్ ఆప్ఘన్ను తప్పించి అతడి స్థానంలో నైబ్ను కెప్టెన్గా ఎంపిక చేశారు. అతడి నాయకత్వంలో ఆప్ఘనిస్థాన్ జట్టు మొత్తం 9 మ్యాచ్లాడి ఒక్క మ్యాచ్లో కూడా నెగ్గలేకపోయింది.
దీంతో వరల్డ్కప్ అనంతరం అతడిని కెప్టెన్సీ నుంచి అతడి స్థానంలో యువ ఆటగాడు రషీద్ ఖాన్ను కెప్టెన్గా నియమించింది. రషీద్ ఖాన్ నాయకత్వంలో కూడా ఆప్ఘనిస్థాన్ జట్టు పేలవ ప్రదర్శన చేయడంతో తాజాగా బుధవారం మూడు ఫార్మాట్లకు తిరిగి అస్గార్ అఫ్గాన్ను కెప్టెన్గా నియమిస్తూ అఫ్గాన్ క్రికెట్ బోర్డు(ఏసీబీ) నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.