ఐపీఎల్ కొత్త సీజన్ ప్రారంభానికి సమయం దగ్గర పడుతోంది. ఛాంపియన్స్ ట్రోఫీ ముగియగానే క్రికెట్ అభిమానుల అందరి ఫోకస్ ఈ ఐపీఎల్ పైనే ఉండనుంది. ఈ క్రమంలోనే లీగ్ ఆరంభానికి ముందు కీలక పరిణామం చోటు చేసుకుంది. ఐపీఎల్ మాజీ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ యాజమాన్యంలో మార్పులు జరగనున్నాయని తెలిసింది. ఈ ఫ్రాంఛైజీలో సింహభాగం వాటాను భారత్ కు చెందిన వ్యాపార సంస్థ టొరెంట్ గ్రూపు కొనుగోలు చేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం అందంది. 67 శాతం వాటాను కొనుగోలు చేయనుందట. కాగా, గుజరాత్ ఫ్రాంఛైజీలో ప్రస్తుత మెజారిటీ ఓనర్ ఇరేలియా కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ సీవీసీ క్యాపిటల్ పార్ట్నర్స్.
ఖరీదైన ఐపీఎల్ టీమ్ గా..
ఒక యాక్టివ్ ఫ్రాంఛైజీలో మెజారిటీ యాజమాన్య వాటా బదలాయింపు జరగడం ఇదే తొలిసారి. ఈ వాటా బదలాయింపు ప్రక్రియతో గుజరాత్ టైటాన్స్.. మార్కెట్ పర్చేస్ వ్యాల్యూ ప్రకారం అత్యంత ఖరీదైన ఐపీఎల్ టీమ్ గా అవతరించనుంది. ఎకానామిక్ టైమ్స్ రిపోర్ట్ ప్రకారం.. అంచనా వేయబడిన గుజరాత్ ఫ్రాంఛైజీ ప్రస్తుత మార్కెట్ విలువ రూ.7500 కోట్లుగా ఉన్న తరుణంలో.. ఇందులో 66 శాతం వాటాను టొరెంట్ దక్కించేందుకు సిద్ధమైంది. ఈ డీల్ కారణంగానే గుజరాత్ టైటాన్స్ ఐపీఎల్ లో అత్యంత ఖరీదైన జట్టుగా నిలవనుంది. అంతకుముందు 2021లో లఖ్ నవూ సూపర్ జెయింట్స్ ను రూ.7,090 కోట్లకు RPSG గ్రూప్ దక్కించుకుంది. ఇప్పుడు దాని కన్నా గుజరాత్ ఫ్రాంఛైజీ మార్కెట్ విలువే ఎక్కువగా ఉంది.

అప్పుడే రూ.4,653 కోట్లకు...
టొరెంట్ గ్రూప్ సంస్థ విలువ రూ.41,000 కోట్లు. భారత్ లోని టాప్ మోస్ట్ మల్టీనేషనల్ కంపెనీలలో ఒకటి. టోరెంట్ పవర్, టొరెంట్ ఫార్మా.. రెండు రంగాలలో రాణిస్తోందీ సంస్థ. ఈ టొరెంట్ సంస్థ.. 2021లోనే రెండు కొత్త జట్ల కోసం బిడ్లను ఆహ్వానించినప్పుడు కూడా ఆసక్తి కనబరిచింది. రూ.4,653 కోట్లతో బిడ్ దాఖలు చేసింది. కానీ అప్పుడు CVC రూ.5,625 కోట్లకు గుజరాత్ లోని మేజర్ వాటాను కొనుక్కుంది.
ఐసీసీ ఆమోదం..
సాధారణంగా యాజమాన్యంలో మార్పులు జరగాలంటే, వాటాలు కొనుగోలు చేయాలంటే ఐపీఎల్ పాలక మండలి ఆమోదం తెలపాల్సి ఉంటుంది. బీసీసీఐ అనుమతి కూడా ఉండాలి. అలానే ఇప్పుడు కూడా టొరెంట్ గ్రూప్.. గుజరాట్ ఫ్రాంఛైజీలో వాటాను కొనుగోలు చేయాలంటే.. ఈ కొత్త ఒప్పందానికి ఐసీసీ, బీసీసీఐ ఆమోదం తెలపాలి. అప్పుడే ఈ ప్రక్రియ పూర్తవుతుంది. దాదాపుగా ఐపీఎల్ కొత్త సీజన్ ప్రారంభానికి ముందే గుజరాత్ ఫ్రాంఛైజీని టొరెంట్ గ్రూపు కొనుగోలు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.