
మరికొన్ని రోజుల్లో మహిళల ప్రీమియర్ లీగ్ మొదలవనుంది. ఈ టోర్నీలో మొత్తం ఐదు జట్టుల పోటీ పడనున్నాయి. వాటిలో అహ్మదాబాద్ కేంద్రంగా ఉన్న గుజరాత్ జెయింట్స్ ఒకటి. ఇటీవలే ముంబై ఇండియన్స్ జట్టు తమ జెర్సీని విడుదల చేసిన నేపథ్యంలో గుజరాత్ ఫ్రాంచైజీ కూడా తమ జెర్సీని విడుదల చేసింది. తమ జెర్సీలో ప్రధాన రంగుగా ఈ ఫ్రాంచైజీ ఆరెంజ్ను ఎంచుకుంది. ఈ జెర్సీ తమ ఆడసింహాల ప్యాషన్, ఉత్సాహాన్ని చూపిస్తుందని గుజరాత్ జెయింట్స్ పేర్కొంది.
తమ జెర్సీని విడుదల చేస్తూ గుజరాత్ జెయింట్స్ ఒక వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీనిలో 'చరిత్రలోనే మొదటి సీజన్లో అడుగుపెట్టే మన ఆడసింహాల ప్యాషన్, ఉత్సాహాన్ని ఈ ఘనమైన జెర్సీ ప్రతిబింబిస్తుంది' అని గుజరాత్ పేర్కొంది. ఈ ఫ్రాంచైజీ యాజమాన్యం అయిన అదానీ గ్రూప్.. ఇంటర్నేషనల్ లీగ్ టీ20లో గల్ఫ్ జెయింట్స్ జట్టును కలిగి ఉంది. ఈ టీం జెర్సీ కూడా ఆరెంజ్ కలర్లోనే ఉంటుంది. ఈ జట్టే మొదటి ఇంటర్నేషనల్ లీగ్ టీ20 విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే.
అదొక్కటే కాదు, సౌతాఫ్రికా టీ20 లీగ్ గెలిచిన సన్రైజర్స్ ఈస్టర్న్ కేప్ జెర్సీ కూడా ఆరెంజ్ కలరే. చివరకు ఈ ఏడాది బిగ్బ్యాష్ లీగ్ విజేతగా నిలిచిన పెర్త్ స్కార్చర్స్ కూడా ఆరెంజ్ కలర్ జెర్సీలోనే ఉంటారు. ఇదంతా చూసిన ఫ్యాన్స్.. ఈ ఏడాది టీ20 లీగ్స్లో ఆరెంజ్ జెర్సీ చాలా బాగా కలిసొచ్చిందని, అందుకే గుజరాత్ జెయింట్స్ కూడా ఈ కలర్ను ఎంచుకుందని అంటున్నారు. కాగా, గతేడాది ఐపీఎల్ అరంగేట్రం చేసిన గుజరాత్ టైటాన్స్ జట్టు ట్రోఫీ నెగ్గిన సంగతి తెలిసిందే. డబ్ల్యూపీఎల్లో గుజరాత్ అమ్మాయిలు శనివారం నాడు తొలి మ్యాచ్ ఆడతారు. ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్తో తలపడతారు.