
మహిళల ప్రీమియర్ లీగ్లో ఒక్క మ్యాచ్ గెలిచిందో లేదో గుజరాత్కు పెద్ద షాక్ తగిలింది. ఆర్సీబీపై ఉత్కంఠ విజయం సాధించిన గుజరాత్ జెయింట్స్.. ఆ విజయాన్ని ఆస్వాదించేలోపే షాకింగ్ వార్త తెలిసింది. అదేంటంటే ఆ జట్టు కెప్టెన్ బెత్ మూనీ ఈ టోర్నీకి దూరమైంది. డబ్ల్యూపీఎల్ ఓపెనింగ్ గేమ్లో ముంబైతో ఆడుతున్న సమయంలో మూనీ గాయపడింది. వేగంగా పరుగు తీసే సమయంలో ఆమె కాలికి గాయమైంది.
ఈ గాయంతో వెంటనే రిటైర్డ్ అవుట్గా ఆమె మైదానం వీడింది. ఆ తర్వాత జరిగిన మ్యాచుల్లో కూడా ఆమె ఆడలేదు. ఈ గాయాన్ని పరిశీలించిన వైద్యులు.. మూనీకి కనీసం ఆరు వారాల విశ్రాంతి అవసరం అని స్పష్టం చేశారు. దీంతో ఆమె డబ్ల్యూపీఎల్ తొలి సీజన్కు దూరమైంది. ఈ విషయాన్ని గుజరాత్ జెయింట్స్ జట్టు అధికారికంగా ప్రకటించింది. ఆమె స్థానంలో సౌతాఫ్రికా ప్లేయర్ లారా వోల్వార్డ్ను తీసుకున్నట్లె వెల్లడించింది.
ఈ సందర్భంగా మూనీ కూడా తన పరిస్థితిపై స్పందించింది. 'గుజరాత్ జెయింట్స్ తరఫున డబ్ల్యూపీఎల్ ఆడేందుకు నేను చాలా ఎదురు చూశా. కానీ ఏం చేస్తాం? ఈ ఆటలో గాయాలు కూడా సహజం. మిగతా టోర్నీలో ఆడలేకపోతున్నందుకు చాలా బాధగా ఉంది. అయితే జట్టు ఎలా ఆడుతుందో గమనిస్తూనే ఉంటా. వాళ్లు గెలవాలని ప్రార్థిస్తా' అని ఆమె చెప్పింది.
ఈ సీజన్కు ఇలా అర్ధంతరంగా దూరమైనా కూడా.. వచ్చే సీజన్లో మరింత బలంగా తిరిగొస్తానని ఆమె తెలిపింది. ప్రస్తుతానికైతే తన జట్టుకు ఆల్ ది బెస్ట్ చెప్తున్నట్లు పేర్కొంది. ఆమె స్థానంలో డ్రాఫ్ట్ చేసిన లారా వోల్వార్డ్ ప్రస్తుతం పాకిస్తాన్లో ఉంది. పీఎస్ఎల్ మహిళల టోర్నీలో ఆడేందుకు ఆమె అక్కడకు వెళ్లింది. ఇప్పుడు డబ్ల్యూపీఎల్లో కూడా తనను తీసుకోవడంపై ఆమె చాలా సంతోషం వ్యక్తం చేసింది. జట్టుతో కలిసేందుకు ఉత్సాహంగా ఉన్నట్లు చెప్పుకొచ్చింది.