గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ మరోసారి చిత్తుగా ఓడింది. ఈ సీజన్ ఆరంభం నుంచి తమ బెస్ట్ ఆటగాళ్లను ఎంపిక చేసుకోవడానికి తెగ ఇబ్బంది పడిన ఈ జట్టు.. గుజరాత్పై బలమైన జట్టుతోనే బరిలో దిగింది. కానీ ఫలితం మాత్రం టీం అనుకున్న విధంగా రాలేదు.
ఈ మ్యాచ్లో టాస్ గెలిచి ఛేజింగ్ ఎంచుకున్న సన్రైజర్స్కు మంచి ఆరంభమే లభించింది. భువనేశ్వర్ కుమార్ తొలి ఓవర్లోనే ప్రమాదకర వృద్ధిమాన్ సాహా (0)ను డకౌట్ చేశాడు. ఆ తర్వాత కూడా అతని జోరు కొనసాగింది. అతనికి నటరాజన్, ఫజల్లాక్ ఫరూఖీ, మార్కో యాన్సెన్ కొంత సహకారం అందించారు.

అయితే గుజరాత్ యువ ఓపెనర్ శుభ్మన్ గిల్ (101) ఈ మ్యాచ్లో అదరగొట్టాడు. అతనితోపాటు సాయి సుదర్శన్ (47) కూడా రాణించాడు. దీంతో ఆ జట్టు 188/9 స్కోరు చేసింది. ఛేజింగ్లో సన్రైజర్స్కు సరైన ఆరంభం దక్కలేదు. షమీ వేసిన మొదటి ఓవర్లోనే అన్మోల్ ప్రీత్ సింగ్ (5) అవుటయ్యాడు.
ఈ మ్యాచ్లో తిరిగి జట్టులో చేరిన యష్ దయాళ్ బౌలింగ్లో ఫామ్లో ఉన్న అభిషేక్ శర్మ (5) కూడా విఫలమయ్యాడు. తనను తాను మూడో స్థానానికి ప్రమోట్ చేసుకున్న కెప్టెన్ ఎయిడెన్ మార్క్రమ్ (10) కూడా ఫెయిలయ్యాడు. రాహుల్ త్రిపాఠీ (1) కూడా ఘోరంగా విఫలమయ్యాడు.
కొత్త కుర్రాడు సన్వీర్ సింగ్ (7) భారీ షాట్ ఆడబోయి సాయి సుదర్శన్కు చిక్కాడు. అబ్దుల్ సమద్ (4), మార్కో యాన్సెన్ (3) కూడా రాణించలేదు. అయితే ఈ మ్యాచ్లో కూడా హెన్రిక్ క్లాసెన్ (64) ఒంటరి పోరాటం చేశాడు. అతనికి భువనేశ్వర్ కుమార్ (27) మంచి సహకారం అందించాడు.
చివర్లో మయాంక్ మార్కండే (18 నాటౌట్) కూడా రాణించాడు. కానీ వీళ్లు ఓటమి అంతరాన్ని మాత్రమే తగ్గించగలిగారు. ఈ మ్యాచ్లో గుజరాత్ పేసర్లు చెలరేగారు. వెటరన్ పేసర్లు మహమ్మద్ షమీ, మోహిత్ శర్మ ఇద్దరూ చెరో నాలుగు వికెట్లతో చెలరేగారు. దీంతో సన్రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 154 పరుగులు మాత్రమే చేయగలిగింది.