సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో గుజరాత్ ఓపెనర్ శుభ్మన్ గిల్ అదరగొట్టాడు. ఇన్నింగ్స్ ఆరంభం నుంచే చాలా చక్కగా బ్యాటింగ్ చేసిన అతను.. కేవలం 56 బంతుల్లోనే 101 పరుగులతో ఆకట్టుకున్నాడు. అతనితోపాటు తమిళనాడు కుర్రాడు సాయి సుదర్శన్ (47) కూడా రాణించాడు.
వీళ్లిద్దరూ తప్ప గుజరాత్ బ్యాటర్లలో ఇంకెవరూ సరిగా ఆడలేదు. అదరిపోయే ఆరంభం అందిస్తాడని అనుకున్న వృద్ధిమాన్ సాహా (0) డకౌట్ అయ్యాడు. సాయి అవుటైన తర్వాత జట్టుకు ఆదుకుంటారని అనుకున్న ఒక్క బ్యాటర్ కూడా డబుల్ డిజిట్ స్కోరు చేయలేకపోయారు. వచ్చిన వాళ్లు వచ్చినట్లే పెవిలియన్కు క్యూ కట్టారు.

ఈ మ్యాచ్లో గిల్, సాయి తప్ప మిగతా బ్యాటర్లు ఎవరూ రాణించలేదు. హార్దిక్ పాండ్యా (8), డేవిడ్ మిల్లర్ (7), రాహుల్ తెవాటియా (3), దాసున్ షనక (9 నాటౌట్), రషీద్ ఖాన్ (0), మహమ్మద్ షమీ (0), నూర్ అహ్మద్ (0), మోహిత్ శర్మ (0 నాటౌట్) పరుగులు చేశారు. ఇలా బ్యాటింగ్ విభాగం అంతా చేతులెత్తేసింది.
అదే సమయంలో సన్రైజర్స్ బౌలింగ్ విభాగంలో కూడా ఒక్కడే రాణించాడు. స్వింగ్ సుల్తాన్ భువనేశ్వర్ కుమార్ ఈ మ్యాచ్లో ఏకంగా ఐదు వికెట్లతో అలరించాడు. దీనికితోడు చివరి ఓవర్లో ఒక రనౌట్ కూడా చేశాడు. అతను కాకుండా మార్కో యాన్సెన్, ఫజల్లాక్ ఫరూఖీ, నటరాజన్ తలో వికెట్ తీసుకున్నారు.
దీంతో గుజరాత్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్లో మంచు ప్రభావం ఉండే అవకాశం ఉంది. దీంతో ఛేజింగ్ చేసే జట్టుకు ఇది కలిసొస్తుంది. మరి సన్రైజర్స్ బ్యాటర్లు ఈ మ్యాచ్లో అయినా రాణించి టేబుల్ టాపర్గా ఉన్న గుజరాత్కు షాకిస్తారేమో చూడాలి.