గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో సన్రైజర్స్ వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. అతని ధాటికి గుజరాత్ బ్యాటర్లలో గిల్ (101), సాయి సుదర్శన్ (47) మినహా ఇంకెవరూ రాణించలేకపోయారు. అతనితోపాటు ఫజల్లాక్ ఫరూఖీ, మార్కో యాన్సెన్, నటరాజన్ కూడా తలో వికెట్తో ఆకట్టుకున్నారు.
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న సన్రైజర్స్కు బంతితో భువీ అదిరిపోయే ఆరంభం అందించాడు. తొలి ఓవర్లోనే ప్రమాదకర వృద్ధిమాన్ సాహా (0)ను డకౌట్ చేశాడు. ఆ తర్వాత గిల్, సాయి కలిసి కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. సాయి అవుటైన తర్వాత వచ్చిన కెప్టెన్ హార్దిక్ పాండ్య (8)ను భువీ ఎక్కువ సేపు క్రీజులో ఉండనివ్వలేదు.

తన బౌలింగ్లో ఎవరికీ పెద్దగా భారీ షాట్లు ఆడే అవకాశమే ఇవ్వని భువీ.. పాండ్యాను బుట్టలో వేసుకున్నాడు. ఆ తర్వాత నటరాజన్ బౌలింగ్లో మిల్లర్ (7) కూడా అవుటయ్యాడు. ఇక చివరి ఓవర్లో అయితే భువీ ఆకాశమే హద్దుగా చెలరేగాడని చెప్పాలి. వేసిన ప్రతి బంతికీ వికెట్ తీసేలా కనిపించాడీ స్వింగ్ సుల్తాన్. ఈ ఓవర్ తొలి బంతికే గిల్ను అవుట్ చేశాడు.
ఆ తర్వాతి బంతికే రషీద్ ఖాన్ (0)ను గోల్డెన్ డక్గా పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాతి బంతిని కనెక్ట్ చేయలేకపోయిన నూర్ అహ్మద్ (0) పరుగు తీసి నాన్స్ట్రైకర్ ఎండ్కు చేరుకునేందుకు ప్రయత్నించాడు. ఈ సమయంలో క్లాసెన్ వేసిన బంతిని అందుకున్న భువీ.. నాన్స్ట్రైకర్ ఎండ్లో వికెట్లను కూల్చాడు. దీంతో నూర్ అహ్మద్ కూడా పరుగులేమీ చేయకుండానే పెవిలియన్ చేరాడు.
మహమ్మద్ షమీ (0) ఆ మరుసటి బంతికి భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. దాన్ని బౌండరీ లైన్ వద్ద యాన్సెన్ సులభంగా అందుకోవడంతో షమీ కూడా గోల్డెన్ డక్గా అవుటయ్యాడు. దీంతో భువీ ఈ మ్యాచ్లో ఐదు వికెట్లతో ఆకట్టుకున్నాడు. వీటిలో మూడు వికెట్లు చివరి ఓవర్లోనే రావడం గమనార్హం. ఆ ఓవర్లో కేవలం రెండు పరుగలే చేసిన గుజరాత్ ఏకంగా నాలుగు వికెట్లు కోల్పోయింది.