గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ చిత్తుగా ఓడింది. ఈ మ్యాచ్లో కూడా హెన్రిక్ క్లాసెన్ (64) ఒంటరి పోరాటం చేశాడు. అతనికి భువనేశ్వర్ కుమార్ (27) మంచి సహకారం అందించాడు. అయితే మిగతా బ్యాటర్లు అందరూ కట్టకట్టుకొని చేతులెత్తేయడంతో ఫలితం మాత్రం ఈ జట్టుకు అనుకూలంగా రాలేదు. ఈ విజయంతో ప్లేఆఫ్స్ చేరుకున్న తొలి జట్టుగా గుజరాత్ రికార్డు సృష్టించింది.
ఈ మ్యాచ్లో టాస్ గెలిచి ఛేజింగ్ ఎంచుకున్న సన్రైజర్స్కు బంతితో మంచి ఆరంభమే లభించింది. భువనేశ్వర్ కుమార్ తొలి ఓవర్లోనే ప్రమాదకర వృద్ధిమాన్ సాహా (0)ను డకౌట్ చేశాడు. ఆ తర్వాత కూడా అతని జోరు కొనసాగింది. అతనికి నటరాజన్, ఫజల్లాక్ ఫరూఖీ, మార్కో యాన్సెన్ కొంత సహకారం అందించారు.

అయితే గుజరాత్ యువ ఓపెనర్ శుభ్మన్ గిల్ (101), సాయి సుదర్శన్ (47) రాణించడంతో ఆ జట్టు 188/9 స్కోరు చేసింది. ఛేజింగ్లో సన్రైజర్స్కు సరైన ఆరంభం దక్కలేదు. యువ ఓపెనర్లు అన్మోల్ ప్రీత్ సింగ్ (5), అభిషేక్ శర్మ (5) ఇద్దరూ విఫలమయ్యారు. తనను తాను మూడో స్థానానికి ప్రమోట్ చేసుకున్న కెప్టెన్ ఎయిడెన్ మార్క్రమ్ (10), రాహుల్ త్రిపాఠీ (1) ఇద్దరూ కూడా ఘోరంగా ఫెయిలయ్యారు.
కొత్త కుర్రాడు సన్వీర్ సింగ్ (7) భారీ షాట్ ఆడబోయి సాయి సుదర్శన్కు చిక్కాడు. అబ్దుల్ సమద్ (4), మార్కో యాన్సెన్ (3) కూడా రాణించలేదు. చివర్లో మయాంక్ మార్కండే (18 నాటౌట్) ఫర్వాలేదనిపించాడు. ఈ మ్యాచ్లో గుజరాత్ పేసర్లు వెటరన్ పేసర్లు మహమ్మద్ షమీ, మోహిత్ శర్మ ఇద్దరూ చెరో నాలుగు వికెట్లతో చెలరేగారు. దీంతో సన్రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 154 పరుగులు మాత్రమే చేయగలిగింది.
ఈ ఓటమిపై సన్రైజర్స్ కెప్టెన్ ఎయిడెన్ మార్క్రమ్ స్పందించాడు. 'మ్యాచ్ సగంలో మేం పోటీలో ఉన్నామనే అనుకున్నాం. కానీ పవర్ప్లేలో నాలుగు వికెట్లు పడటంతో బాగా వెనకపడ్డాం. మా టీంలో హైక్లాస్ బౌలర్లు ఉన్నారు. ఇక్కడ మంచి స్వింగ్ దొరుకుతుందని అనుకున్నాం. కానీ అంత స్వింగ్ దొరకలేదు. మ్యాచ్లో మమ్మల్ని పోటీలోకి తెచ్చినందుకు భువీని కచ్చితంగా మెచ్చుకోవాలి' అని చెప్పాడు.
అలాగే గుజరాత్ ఓపెనర్ గిల్ను కూడా మెచ్చుకున్నాడు. 'గిల్ అద్భుతంగా ఆడాడు. క్లాసెన్ కూడా మంచి క్లాస్ ఆటగాడు. బలంతోపాటు మంచి క్రికెట్ బుర్ర ఉన్నవాడు. కానీ దురదృష్టవశాత్తూ మిగతా వాళ్లు అతనికి సహకారం అందించడంలో విఫలమయ్యారు. మిగతా మ్యాచుల్లో మరింత పట్టుదలగా గెలిచేందుకు ప్రయత్నిస్తాం. కొత్తవారికి అవకాశమివ్వాలని, వాళ్లు చక్కగా రాణించాలని కోరుకుంటాం. కానీ మేం సరిగా రాణించడం లేదు' అని మార్క్రమ్ అభిప్రాయపడ్డాడు.