ఐపీఎల్ డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్కు గట్టి షాక్ తగిలింది. టేబుల్ టాపర్ ప్లేస్ కోసం రాజస్థాన్ రాయల్స్తో తలపడిన ఈ మ్యాచ్లో గుజరాత్ ఓటమి పాలైంది. ఈ విజయంతో రాజస్థాన్ మొత్తం పాయింట్ల సంఖ్య 8కి చేరింది. దీంతో టేబుల్ టాపర్గా నిలిచింది. ఈ మ్యాచ్ కనుక గుజరాత్ గెలిచి ఉంటే.. ఆ జట్టు టేబుల్ టాపర్గా నిలిచేది.
చివరి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్లో విజయం తర్వాత రాజస్థాన్ కెప్టెన్ సంజూ శాంసన్ స్పందించాడు. 'ఇలాంటి క్వాలిటీ స్టేడియంలో ఒక క్వాలిటీ టీంను ఎదుర్కొంటే ఆ మ్యాచ్ సూపర్గా ఉంటుంది. ఈ మ్యాచ్ గెలిచినందుకు చాలా సంతోషంగా ఉన్నాను. ఈ మ్యాచ్లో బౌలర్లను రొటేట్ చేయడం చాలా కీలకం అని నాకు అర్థమైంది' అని సంజూ చెప్పాడు. తమ స్పిన్నర్లపై గుజరాత్ బ్యాటర్లు ఎదురు దాడి చేశారని సంజూ గుర్తుచేశాడు.

'టైం అవుట్ తర్వాత గుజరాత్ బ్యాటర్లు అద్భుతమైన షాట్లు ఆడారు. అలాంటప్పుడు ప్రత్యర్థిపై గౌరవం పెరుగుతుంది. అయితే మా బౌలర్లు వాళ్లను 170+ స్కోరుకే పరిమితం చేసినందుకు చాలా గర్విస్తున్నా. అయితే మాకు ఛేజింగ్లో దక్కిన ఓపెనింగ్ ఏమాత్రం బాగలేదు. అది చూస్తేనే వికెట్ ఎలా ఉందో అర్థం అవుతుంది' అని వెల్లడించాడు. గుజరాత్ వద్ద క్వాలిటీ బౌలింగ్ ఉందని, పవర్ప్లేలో దాన్ని మేం గౌరవించక తప్పదని సంజూ తేల్చిచెప్పాడు.
అయితే కొంత సమయం గడిచిన తర్వాత భారీ షాట్లు ఆడే అవకాశం ఉందని నమ్మినట్లు తెలిపాడు. డేవిడ్ మిల్లర్ను ఆడమ్ జంపా ఆల్మోస్ట్ బుట్టలో వేసుకున్నాడని, ఏదేమైనా చివరకు తమకు అంతా మంచే జరిగిందని చెప్పుకొచ్చాడు. ఇక హెట్మెయర్కు ఇలాంటి థ్రిల్లింగ్ మ్యాచులంటే ఇష్టం, అతనికి ఇలాంటి పరిస్థితులు కల్పించడంలో తమకేం ఇబ్బంది లేదు అంటూ సంజూ జోకులు పేల్చాడు.