డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ ఈ ఏడాది కొంత తడబడుతోంది. రాజస్థాన్తో జరిగిన మ్యాచ్లో కూడా హార్దిక్ టీం ఓటమి పాలైంది. అయితే ఈ మ్యాచ్ చూసిన వాళ్లందరూ గుజరాత్ టైటాన్స్ ఓటమికి హార్దిక్ పాండ్యానే కారణం అంటున్నారు. గతేడాది తన బౌలింగ్ మార్పులతో అందరి మన్ననలు పొందిన హార్దిక్.. ఈ మ్యాచ్లో మాత్రం తన వింత నిర్ణయాలతో విమర్శలపాలు అవుతున్నాడు.
రాజస్థాన్, గుజరాత్ మధ్య జరిగిన మ్యాచ్లో గుజరాత్ కీలక పేసర్ మోహిత్ శర్మ కేవలం రెండు ఓవర్లు మాత్రమే వేశాడు. గుజరాత్ ఆడిన చివరి మ్యాచ్లో మోహిత్కు 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కిన సంగతి తెలిసిందే. అలాంటి కీలక బౌలర్ ఓవర్లు మిగిలే ఉండగా.. చివరి ఓవర్ను కొత్త కుర్రాడు నూర్ అహ్మద్కు అప్పగించాడు హార్దిక్. అంతకుముందు ఓవర్లో అశ్విన్ మూడు బంతుల్లోనే పది పరుగులు చేయడంతో రాజస్థాన్.. అప్పటికే మ్యాచ్ గెలిచే స్థితికి చేరింది.

చివరి ఓవర్లో 7 పరుగులు కాపాడుకోవాల్సిన స్థితిలో గుజరాత్ అభిమానులందరూ బంతి మోహిత్కే ఇస్తారని అనుకున్నారు. ఎందుకంటే ఈ మ్యాచ్లో రెండు ఓవర్లు వేసిన మోహిత్ కేవలం 7 పరుగులే ఇచ్చాడు. మిగతా బౌలర్లు అందరూ భారీగా పరుగులు ఇచ్చినా.. మోహిత్ చాలా పొదుపుగా బౌలింగ్ చేశాడు. కానీ కనీసం అతని పూర్తి కోటా ఓవర్లు కూడా హార్దిక్ వేయనివ్వలేదు. మిగతా బౌలర్లతో ప్రయోగాలు చేశాడు.
దీంతో గుజరాత్కు ఓటమి తప్పలేదు. చివరి ఓవర్ రెండో బంతికే భారీ సిక్సర్ బాదిన హెట్మెయర్.. మ్యాచ్ను ముగించాడు. ఇది చూసిన ఫ్యాన్స్ అందరూ హార్దిక్ తెలివితేటలపై జోకులు పేలుస్తున్నారు. 'హార్దిక్ కూడా ధోనీ అవ్వాలని అనుకున్నాడు. అందుకే నూర్ అహ్మద్కు బంతి ఇచ్చాడు' అని ఎగతాళి చేస్తున్నారు. తొలి టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో చివరి ఓవర్ను హర్భజన్ సింగ్ వేస్తాడని అంతా అనుకుంటే.. ధోనీ మాత్రం జోగీందర్ శర్మకు ఆ ఓవర్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
ఇప్పుడు హార్దిక్ కూడా ఎవరి అంచనాలకూ అందకుండా నిర్ణయం తీసుకోవాలని ట్రై చేశాడని, కానీ ఈ వ్యూహం బెడిసికొట్టిందని ఫ్యాన్స్ విమర్శిస్తున్నారు. అసలు ఈ మ్యాచ్లో హార్దిక్ చేసిన బౌలింగ్ మార్పులు ఏవీ బాగలేవని కొందరు ఘాటుగానే విమర్శిస్తున్నారు. కనీసం మ్యాచ్ ఆరంభం నుంచి కూడా జట్టులో లేని నూర్ అహ్మద్ను చివరి ఓవర్లలో ఉపయోగించుకోవడం ఏంటని నిలదీస్తున్నారు.