ఒక్కోసారి ఒక ప్లేయర్ ఎన్ని బంతులు ఆడాడనే విషయం కాదు.. క్రీజులో ఏం చేశాడనేదే ఆ జట్టును గెలిపిస్తుంది. గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్లో కూడా ఇలాగే జరిగింది. ఈ మ్యాచ్లో రాజస్థాన్ కెప్టెన్ సంజూ శాంసన్, ఫినిషర్ హెట్మెయర్ హాఫ్ సెంచరీలతో చెలరేగారు. కానీ రాజస్థాన్ విజయంలో కీలక పాత్ర పోషించింది మాత్రం అశ్విన్.
బౌలింగ్లో అశ్విన్ పెద్దగా రాణించలేదు. మొత్తం 4 ఓవర్లలో 37 పరుగులు ఇచ్చాడు. అతనితోపాటు ఆడమ్ జంపా బౌలింగ్లో గుజరాత్ బ్యాటర్లు ఎదురు దాడికి దిగడంతో వాళ్లు ఏం చేయలేకపోయారు. చివర్లో డేవిడ్ మిల్లర్ (46), అభినవ్ మనోహర్ (27) చెలరేగి, ఎడాపెడా బౌండరీలతో విరుచుకుపడ్డారు. దీంతో 150 పరుగులు కూడా చేయదని అనుకున్న ఆ జట్టు 177 పరుగుల స్కోరు చేసింది.

లక్ష్య ఛేదనలో రాజస్థాన్కు మంచి ఆరంభం లభించలేదు. మంచి ఫామ్లో ఉన్న జోస్ బట్లర్ (0) డకౌట్ అయ్యాడు. యశస్వి జైస్వాల్ (1) కూడా విఫలమయ్యాడు. ఇలాంటి సమయంలో సంజూ శాంసన్ (60), దేవదత్ పడిక్కల్ (27) కాసేపు ఇన్నింగ్స్ చక్కదిద్దే బ్యాటింగ్ చేశారు. చివర్లో హెట్మెయర్ (56 నాటౌట్) మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. అయితే చివర్లో వచ్చి మ్యాచ్ మలుపు తిప్పింది అశ్వినే.
ధృవ్ జురెల్ (18) భారీ షాట్ ఆడే క్రమంలో అవుటయ్యే సమయానికి హెట్మెయర్పై తీవ్రమైన ఒత్తిడి పడింది. అప్పటికే రెండు సార్లు భారీ షాట్లు ఆడేందుకు ప్రయత్నించిన అతను టైమింగ్ మిస్ అయ్యాడు కూడా. ఇలాంటి సమయంలో జురెల్ అవుట్ అవడంతో హెట్మెయర్పై ఒత్తిడి రెట్టింపు అయింది. ఇలాగైతే రాజస్థాన్ గెలవడం చాలా కష్టం అని ఫ్యాన్స్ అనుకున్నారు.
అలాంటి టైంలో బ్యాటింగ్కు వచ్చిన అశ్విన్.. తను ఎదుర్కొన్న తొలి బంతికే చక్కని డ్రైవ్తో బౌండరీ బాదాడు. రెండో బంతికే అద్భుతమైన సిక్సర్ బాదాడు. ఆ తర్వాతి బంతికే అశ్విన్ అవుటైనా కూడా.. అప్పటికే గుజరాత్కు జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అశ్విన్ చెలరేగడంతో రాజస్థాన్ విజయానికి చివరి ఓవర్లో కేవలం 7 పరుగులే అవసరం అయ్యాయి. వీటిని హెట్మెయర్ సులభంగా సాధించాడు.
ఇది చూసిన ఫ్యాన్స్ అశ్విన్ బ్యాటింగ్ను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఆడింది మూడు బంతులే అయినా.. మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశాడని మెచ్చుకుంటున్నారు. హెట్మెయర్పైనే కాదు, తమపై కూడా అశ్విన్ తన బ్యాటింగ్తో ఒత్తిడి తగ్గించాడని అంటున్నారు. అతని కామియో ఇన్నింగ్స్ వల్ల రాజస్థాన్ విజయం చాలా సులభమైందని, అతను లేకపోతే చివరి బంతి వరకు మ్యాచ్ వెళ్లేదని అంటున్నారు.