గుజరాత్ టైటాన్స్తో జరుగుతున్న మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ విభాగం కుప్పకూలింది. ఒకరి తర్వాత ఒకరు చొప్పున బ్యాటర్లు అందరూ పెవిలియన్కు క్యూ కట్టారు. దీంతో ఆ జట్టు చాలా స్వల్ప స్కోరు చేసింది. మంచి ఫామ్లో ఉన్న యశస్వి జైస్వాల్ (14) ఈ మ్యాచ్లో రన్ అవుట్ అయ్యాడు. ఇది ఆ టీంపై చాలా ప్రభావం చూపించిందనే చెప్పాలి.
అంతకుముందే రెండు బౌండరీలు బాది మంచి జోరు మీద కనిపించిన జోస్ బట్లర్ (8) ఆ మరుసటి బంతిని కట్ చేయబోయి పెవిలియన్ చేరాడు. ఇక మంచి టచ్లో ఉండి, బంతిని కచ్చితమైన టైమింగ్తో ఆడిన సంజూ శాంసన్ (30) కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేదు. ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లు ఒకరి తర్వాత మరొకరు పెవిలియన్కు క్యూ కట్టారు.

దేవదత్ పడిక్కల్ (12), అశ్విన్ (2) కూడా పెద్దగా రాణించలేదు. ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చి రాణిస్తాడని అనుకున్న రియాన్ పరాగ్ (4) కూడా తేలిపోయాడు. ఆశలు పెట్టుకున్న షిమ్రాన్ హెట్మెయర్ (7), ధృవ్ జురెల్ (9) దారుణంగా ఫెయిలయ్యారు. అనూహ్యంగా ట్రెంట్ బౌల్ట్ (15) ఫర్వాలేదు అనిపించాడు. చివర్లో ఆడమ్ జంపా (7) రనౌట్ అవడంతో రాజస్థాన్ రాయల్స్ ఇన్నింగ్స్ ముగిసింది.
ఈ టీం 17.5 ఓవర్లలోనే 118 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో గుజరాత్ ముందు చాలా స్వల్ప లక్ష్యమే మిగిలింది. గుజరాత్ బౌలర్లలో రషీద్ ఖాన్ మూడు వికెట్లతో అదరగొట్టాడు. మరో ఆఫ్ఘానీ ప్లేయర్ నూర్ అహ్మద్ కూడా రెండు వికెట్లతో ఆకట్టుకున్నాడు .హార్దిక్ పాండ్యా, జోష్ లిటిల్, మహమ్మద్ షమీ తలో వికెట్ తీసుకున్నారు. ముంబైపై భారీ స్కోరు చేసిన రాజస్థాన్ జట్టు ఈ మ్యాచ్లో ఇంత తక్కువ స్కోరు చేయడం చూసిన ఫ్యాన్స్ షాకైపోయారు.