రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ ఈజీ విక్టరీ సాధించింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ జట్టు ఆశించిన స్కోరు చేయలేకపోయింది. ఓపెనర్లు జోస్ బట్లర్ (8), యశస్వి జైస్వాల్ (14) ఇద్దరూ పెద్దగా ఆకట్టుకోలేదు. మంచి ఫామ్లో ఉన్న జైస్వాల్ రనౌట్ అవడం ఈ మ్యాచ్ ఫలితాన్ని ప్రభావితం చేసిందని చెప్పాలి.
జైస్వాల్ అవుటైన కాసేపటికే సంజూ శాంసన్ (30) కూడా పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లు కనీసం రెండంకెల స్కోరు సాధించడానికి కష్టపడ్డారు. సంజూ తర్వాత ట్రెంట్ బౌల్ట్ (15) టాప్ స్కోరర్ అంటేనే రాజస్థాన్ బ్యాటింగ్ ఎంత ఘోరంగా విఫలమైందో చెప్పొచ్చు. ఈ క్రమంలో బలమైన గుజరాత్ బ్యాటింగ్ లైనప్ ముందు 118 పరుగుల స్వల్ప టార్గెట్ ఉంచింది.

లక్ష్య ఛేదనలో గుజరాత్కు అదిరిపోయే ఆరంభం లభించింది. ఫామ్లో ఉన్న శుభ్మన్ గిల్ (36) మరోసారి ఫర్వాలేదు అనిపించాడు. చివరి రెండు మ్యాచుల్లో విఫలమైన వృద్ధిమాన్ సాహా (41 నాటౌట్) ఈ మ్యాచ్లో అద్భుతంగా ఆడాడు. ఆరంభం నుంచే రాజస్థాన్ బౌలర్లపై ఎదురు దాడికి దిగాడు. దీంతో గుజరాత్ టైటాన్స్ స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. ఇలాంటి సమయంలో చాహల్ బౌలింగ్లో గిల్ ముందుకొచ్చి భారీ షాట్ ఆడబోయి అవుటయ్యాడు.
గిల్ అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన హార్దిక్ పాండ్యా కేవలం 15 బంతుల్లోనే 39 పరుగులతో అజేయంగా నిలిచాడు. వచ్చీ రావడంతోనే భారీ షాట్లతో విరుచుకు పడిన అతను.. తన ఇన్నింగ్స్లో మూడు సిక్సులు, మూడు ఫోర్లు బాదాడు. దీంతో గుజరాత్ ఈజీగా విజయం సాధించింది. రాజస్థాన్ బౌలర్లలో కేవలం చాహల్ ఒక్కడే ఒక వికెట్ తీసుకున్నాడు. మిగతా బౌలర్లు పెద్దగా ప్రభావం చూపలేదు.
ఈ మ్యాచ్లో రెండు జట్ల బ్యాటింగ్ చూసిన అభిమానులకు ఏం అర్థం కాలేదు. అసలు రెండు టీమ్స్ ఒకే పిచ్పై ఆడాయా? అనే అనుమానం కలిగింది. రాజస్థాన్ బ్యాటర్లు క్రీజులో కుదురుకోవడానికే కష్టపడితే.. గుజరాత్ బ్యాటర్లు మాత్రం భారీ షాట్లతో ఎదురు దాడికి దిగారు. ఏదేమైనా ఈ విజయంతో టేబుల్ టాపర్ గుజరాత్ జట్టు పాయింట్ల పట్టికలో తమ స్థానాన్ని మరింత పదిలం చేసుకుంది.