వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ ఘనవిజయం సాధించింది. టేబుల్ టాపర్ గుజరాత్ టైటాన్స్పై అద్భుతమైన విజయం సాధించింది. గుజరాత్ను 27 పరుగుల తేడాతో చిత్తుచేసింది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ముంబైకి ఇషాన్ కిషన్ (31), రోహిత్ శర్మ (29) మంచి ఆరంభం అందించారు.
ఆ తర్వాత వచ్చిన సూర్యకుమార్ యాదవ్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. అతను కేవలం 49 బంతుల్లోనే 11 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 103 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతనికి విష్ణు వినోద్ (30) కొంత సహకారం అందించాడు. ఈ క్రమంలోనే ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 218 పరుగుల భారీ స్కోరు చేసింది.

లక్ష్య ఛేదనలో గుజరాత్ ఓపెనర్లు తేలిపోయారు. వృద్ధిమాన్ సాహా (2), శుభ్మన్ గిల్ (6) ఇదదరూ విఫలమయ్యారు. మూడో స్థానంలో వచ్చిన కెప్టెన్ హార్దిక్ పాండ్యా (4), అభినవ్ మనోహర్ (2) కూడా ఫెయిలయ్యారు. ఇలాంటి సమయంలో విజయ్ శంకర్ (29), డేవిడ్ మిల్లర్ (46) కొంత పోరాడారు.
చివర్లో రషీద్ ఖాన్ (32 బంతుల్లో 79 నాటౌట్) చెలరేగినా ఫలితం లేకపోయింది. చివరకు గుజరాత్ ఓడిపోయింది. ఈ మ్యాచ్లో రషీద్ ఖాన్ నాలుగు వికెట్లు కూడా తీసుకోవడం గమనార్హం. ఈ విజయంపై ముంబై సారధి రోహిత్ శర్మ స్పందించాడు. ఇది తమ వరకు చాలా ఇంట్రస్టింగ్ గేమ్ అని చెప్పాడు. రెండు పాయింట్లు సాధించినందుకు చాలా సంతోషంగా ఉందన్నాడు.
'ముందుగా బ్యాటింగ్ చేసి, లక్ష్యాన్ని కాపాడుకోవడం చాలా సంతోషంగా అనిపించింది. మేం క్రమం తప్పకుండా వికెట్లు తీసుకున్నాం. ఈ ఫార్మాట్లో అది చాలా ముఖ్యం. మా బౌలర్లు అదరగొట్టారు. బ్యాటింగ్లో రైట్, లెఫ్ట్ కాంబినేషన్ కొనసాగించాలని అనుకున్నాం. కానీ స్కై వచ్చి నేను వెళ్తా అన్నాడు. తన కాన్ఫిడెన్స్ అలాంటిది. అది మిగతా వాళ్లకు కూడా అంటుకుంటుంది' అని నవ్వేశాడు.
'ప్రతి మ్యాచ్నూ సూర్య ఫ్రెష్గా మొదలు పెట్టాలని అనుకుంటాడు. చివరి మ్యాచ్ ఎలా జరిగిందని అసలు ఆలోచించడు. కొన్నిసార్లు ఈ మ్యాచ్లో అదరగొట్టాం అని గర్వపడే ఛాన్స్ ఉంటుంది. కానీ తను అలాంటి ఆటగాడు కాదు' అని చెప్పుకొచ్చాడు. ముంబై ఈ మ్యాచ్ గెలవడంతో రాజస్థాన్, లక్నో, బెంగళూరు, పంజాబ్ జట్ల ప్లేఆఫ్స్ అవకాశాలు మరింత సంక్లిష్టంగా మారాయి.