వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్లో టేబుల్ టాపర్ గుజరాత్ టైటాన్స్కు ఓటమి తప్పలేదు. అద్భుతంగా ఆడిన ముంబై ఇండియన్స్ జట్టు.. గుజరాత్ను 27 పరుగుల తేడాతో చిత్తుచేసింది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ముంబైకి ఇషాన్ కిషన్ (31), రోహిత్ శర్మ (29) మంచి ఆరంభం అందించారు.
ఆ తర్వాత వచ్చిన సూర్యకుమార్ యాదవ్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. అతను కేవలం 49 బంతుల్లోనే 11 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 103 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతనికి విష్ణు వినోద్ (30) కొంత సహకారం అందించాడు. ఈ క్రమంలోనే ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 218 పరుగుల భారీ స్కోరు చేసింది.

లక్ష్య ఛేదనలో గుజరాత్ ఓపెనర్లు తేలిపోయారు. వృద్ధిమాన్ సాహా (2), శుభ్మన్ గిల్ (6) ఇదదరూ విఫలమయ్యారు. మూడో స్థానంలో వచ్చిన కెప్టెన్ హార్దిక్ పాండ్యా (4), అభినవ్ మనోహర్ (2) కూడా ఫెయిలయ్యారు. ఇలాంటి సమయంలో విజయ్ శంకర్ (29), డేవిడ్ మిల్లర్ (46) కొంత పోరాడారు.
చివర్లో రషీద్ ఖాన్ (32 బంతుల్లో 79 నాటౌట్) చెలరేగినా ఫలితం లేకపోయింది. చివరకు గుజరాత్ ఓడిపోయింది. ఈ మ్యాచ్లో రషీద్ ఖాన్ నాలుగు వికెట్లు కూడా తీసుకోవడం గమనార్హం. ఈ ఓటమిపై హార్దిక్ పాండ్యా స్పందించాడు. తమ జట్టులో కేవలం రషీద్ ఖాన్ మాత్రమే ఆడినట్లు అనిపించిందని చెప్పాడు.
'బౌలింగ్, బ్యాటింగ్ రెండు విభాగాల్లో రషీద్ అదరగొట్టాడు. ఇప్పుడు ఓడిపోయినా కూడా తర్వాతి మ్యాచుల్లో మరీ ఎక్కువ మార్పులు చేయనక్కర్లేదు. ఒక గ్రూప్లా మేం ఆడలేకపోయాం. బౌలింగ్లో కూడా మేం చాలా ఫ్లాట్గా బౌలింగ్ చేశాం. సరైన ప్లాన్స్ లేకుండా బౌలింగ్ చేశాం. ఒకవేళ ప్లాన్స్ ఉన్నా వాటిని అమల్లో పెట్టలేకపోయాం. వికెట్ చాలా ఫ్లాట్గా ఉంది. కానీ మేం ఒక 25 పరుగులు అదనంగా ఇచ్చామని అనుకుంటున్నా' అని తెలిపాడు.
'ఒక సూర్య గురించి ఏం చెప్తాం. అతను టీ20 క్రికెట్లో బెస్ట్. సరైన ప్లాన్స్ లేకపోతే ఏం జరుగుతుందో చూశాం కదా. ఒక బౌలర్గా క్లియర్గా ఉండటం చాలా ముఖ్యం. నేను ఫీల్డింగ్ మాత్రమే సెట్ చేయగలను. ఐదు వికెట్లు కోల్పోయిన ముంబై చివరి 10 ఓవర్లలో 129 పరుగులు చేసిందంటే.. మేం మా ప్లాన్స్ సరిగా అమలు చేయలేదనే. అందుకే ఓడిపోయాం. ఇంటెన్సిటీ కూడా ఏమాత్రం లేకుండా ఆడాం. ఏదో ఒకటి జరుగుతుందని అనుకున్నాం. కానీ మనం ఏం చెయ్యకుండా అనుకున్నవి జరగవని మా అందరికీ తెలుసు' అని పేర్కొన్నాడు.