ఐపీఎల్ చరిత్రలో తొలిసారి అన్నదమ్ములు ఢీకొడుతున్నారు. కృనాల్ పాండ్యా, హార్దిక్ పాండ్యా ఇద్దరూ కీలకమైన పోరు కోసం రెడీ అయ్యారు. రెండు వేరు వేరు జట్లకు కెప్టెన్లుగా ఇద్దరు అన్నదమ్ములు తలపడటం ఐపీఎల్లో ఇదే తొలిసారి. గాయంతో లక్నో టీం కెప్టెన్ కేఎల్ రాహుల్ జట్టుకు దూరమైన సంగతి తెలిసిందే. అతను లేకపోవడంతో కృనాల్ పాండ్యకు ఈ జట్టు పగ్గాలు అందాయి.
అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో లక్నో కెప్టెన్ కృనాల్ పాండ్యా టాస్ గెలిచాడు. తాము ముందుగా బౌలింగ్ చేస్తామని చెప్పాడు. ఇలా అన్నదమ్ములు రెండు టీమ్స్కు కెప్టెన్లుగా ఉండటం ఏదో కలలా ఉందన్నాడు. కానీ ఒక్కసారి మైదానంలో దిగితే గేమ్ ఫేస్ ఆన్ అయిపోతుందన్నాడు. రెండు ఇన్నింగ్సుల్లో పిచ్ దాదాపు ఒకేలా ఉండే అవకాశం ఉందని అభిప్రాయపడ్డాడు.

అయితే తమ వద్ద మంచి బౌలింగ్ యూనిట్ ఉందని, అందుకే ముందుగా బౌలింగ్ చేయాలని అనుకుంటున్నట్లు తెలిపాడు. అలాగే తమ జట్టులో ఒక మార్పు చేశామన్నాడు. నవీన్ ఉల్ హక్ను పక్కన పెట్టామని, అతని స్థానంలో క్వింటన్ డీకాక్ ఆడుతున్నాడని వెల్లడించాడు. ఈ క్రమంలో తను టాస్ గెలిచినా కూడా ముందుగా బ్యాటింగ్ తీసుకునే వాడినని హార్దిక్ పాండ్యా చెప్పాడు.
ఇలా ఇద్దరు అన్నదమ్ములు పోటీ పడటం తమ కుటుంబానికి చాలా ఎమోషనల్ రోజు అన్నాడు. 'మా నాన్న ఉండి ఉంటే చాలా గర్వపడేవాడు. ఇలా జరగడం ఇదే మొదటి సారి. ఏం మాట్లాడాలో తెలియడం లేదు. కానీ మా ఫ్యామిలీ అంతా చాలా ప్రౌడ్ ఫీల్ అవుతోంది. కానీ చివరకు ఒక్క పాండ్యానే గెలుస్తాడు. మా కుర్రాళ్లు అందరూ ఈ స్టేడియాన్ని సొంత మైదానంలా ఫీలవ్వాలని ఆశిస్తున్నా' అని చెప్పుకొచ్చాడు.
అదే సమయంలో ఆటగాళ్లు తమను తాము ఎలా వ్యక్తం చేసుకుంటారనే దానిపై ఆట ఆధార పడి ఉంటుందన్నాడు. అయితే ప్రస్తుతం ఫలితం గురించి పెద్దగా టెన్షన్ పడటం లేదని చెప్పాడు. ఓడిపోతామనే భయం కన్నా గెలవాలనే కోరిక ఎక్కువగా ఉండాలన్నాడు. ఐర్లాండ్ తరఫున ఆడేందుకు వెళ్లిన జోష్ లిటిల్ స్థానంలో అల్జారీ జోసెఫ్ ఆడుతున్నట్లు వెల్లడించాడు.