సొంత మైదానంలో మ్యాచ్.. ప్రత్యర్థిని తక్కువ స్కోరుకే కట్టడి చేశారు. ఛేజింగ్లో అదిరే ఆరంభం దొరికింది. మిడిల్ ఓవర్లలో కూడా చక్కగా ఆడారు. ఇంత చేసినా లక్నోకు ఓటమి తప్పలేదు. లక్నో వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న గుజరాత్ టైటాన్స్ను లక్నో బౌలర్లు ముప్పుతిప్పలు పెట్టారు. ఒక్క బ్యాటర్ను కూడా స్వేచ్ఛగా ఆడనివ్వలేదు.
ఈ క్రమంలో గుజరాత్ కేవలం 135 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ స్కోరు చూసిన చాలా మంది కచ్చితంగా లక్నో గెలుస్తుందని అనుకున్నారు. ఛేజింగ్లో కైల్ మేయర్స్ (24) అద్భుతమైన ఆరంభం అందించాడు. అతనితోపాటు కేఎల్ రాహుల్ (68) కూడా మంచి స్కోరు చేశాడు. కృనాల్ పాండ్యా (23) ఫర్వాలేదనిపించాడు. కానీ మిగతా బ్యాటర్లు మాత్రం ఏమాత్రం ప్రభావం చూపలేదు.

పాండ్యా అవుటయ్యే సమయానికే లక్నో విజయం దాదాపు ఖాయమైంది. క్రీజులో ఉన్న రాహుల్ కూడా జోరు పెంచేలా కనిపించాడు. కానీ చివరి ఐదు ఓవర్లలో గుజరాత్ బౌలింగ్ పూర్తిగా మారిపోయింది. రాహుల్, పూరన్ (1) ఇద్దరికీ షాట్లు ఆడే అవకాశమే ఇవ్వలేదు. ఆ తర్వాత వచ్చిన ఆయుష్ బదోనీ (8), మార్కస్ స్టొయినిస్ (0), దీపక్ హుడా (2) కూడా వేగంగా ఆడే తొందరలో పెవిలియన్ చేరారు.
మ్యాచ్ గెలిపిస్తాడని అనుకున్న రాహుల్ చాలా జిడ్డు బ్యాటింగ్ చేశాడు. అతను చేసిన 68 పరుగుల కోసం 61 బంతులు తీసుకున్నాడు. చివరి ఓవర్ వరకు క్రీజులో ఉన్న అతను 20వ ఓవర్ రెండో బంతికి భారీ షాట్ ఆడబోయి పెవిలియన్ చేరాడు. ఆ ఓవర్ వేసిన మోహిత్ శర్మ అదిరిపోయే ప్రదర్శన చేశాడు. రాహుల్ను స్లో బౌన్సర్తో ఏమార్చిన అతను.. ఆ మరుసటి బంతికే స్టొయనిస్ను కూడా అవుట్ చేశాడు.
మోహిత్ వేసిన బంతిని భారీ షాట్ ఆడేందుకు స్టొయినిస్ ప్రయత్నించాడు. స్ట్రెయిట్గా సిక్సర్ కొట్టబోయాడు. అయితే అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న మిల్లర్ సూపర్ క్యాచ్ అందుకోవడంతో స్టొయినిస్ కూడా పెవిలియన్ చేరాడు. దీంతో లక్నో గెలవాలంటే మూడు బంతుల్లో 9 పరుగులు చేయాల్సి వచ్చింది. ఈ క్రమంలో వేగంగా పరుగులు చేసేందుకు ప్రయత్నించిన హుడా, బదోనీ ఇద్దరూ రనౌట్ అయ్యారు.
చివరకు లక్నో జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 128 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో గుజరాత్ 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. గుజరాత్ బౌలర్లలో నూర్ అహ్మద్, మోహిత్ శర్మ ఇద్దరూ చెరో రెండు వికెట్లతో ఆకట్టుకున్నారు. రషీద్ ఖాన్ ఒక వికెట్ తీసుకున్నాడు. ఈ విజయంతో గుజరాత్ కూడా నాలుగు విజయాలు సాధించినట్లయింది. దీంతో ఆ జట్టు పాయింట్లు కూడా 8కి చేరాయి.