లక్నో సూపర్ జెయింట్స్తో జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ భారీ విజయం సాధించింది. అన్నదమ్ములు హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా రెండు వేరు వేరు జట్లకు కెప్టెన్లుగా తలపడ్డారు. ఇలా అన్నదమ్ములు కెప్టెన్లుగా తలపడటం ఐపీఎల్ చరిత్రలో ఇదే తొలిసారి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన కృనాల్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. అయితే ఈ నిర్ణయమే బెడిసి కొట్టింది.
వృద్ధిమాన్ సాహా (81), శుభ్మన్ గిల్ (94 నాటౌట్) ఇద్దరూ ఆకాశమే హద్దుగా చెలరేగారు. దీంతో ఆ జట్టు ఏకంగా 227 పరుగుల భారీ స్కోరు చేసింది. ఛేజింగ్ను లక్నో కూడా బాగానే ప్రారంభించింది. కైల్ మేయర్స్ (48), క్వింటన్ డీకాక్ (70) అద్భుతంగా ఆడారు. అయితే మేయర్స్ అవుట్ అవగానే ఫామ్లో లేని దీపక్ హుడా (11)ను పంపిన లక్నో టీం మేనేజ్మెంట్ తప్పు చేసింది.

ఈ స్థానంలో కొన్నిరోజుల క్రితం చెలరేగిన ఆయుష్ బదోనీని పంపాల్సిన మేనేజ్మెంట్.. హుడాను పంపి పెద్ద పొరపాటే చేసింది. ఎందుకంటే హుడా రాకతో లక్నో ఛేజింగ్ వేగం మందగించింది. ఆ తర్వాత వచ్చిన స్టొయినిస్ (4) కూడా ఒత్తిడికి గురై పెవిలియన్ చేరాడు. ఆయుష్ బదోనీ (21) ఫర్వాలేదనిపించగా.. నికోలస్ పూరన్ (3) మళ్లీ ఫెయిలయ్యాడు.
దీంతో ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 171 పరుగులకే చతికిలపడింది. అంటే గుజరాత్ జట్టు ఈ మ్యాచ్లో ఏకంగా 56 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో ఐపీఎల్ పాయింట్ల పట్టికలో గుజరాత్ తన అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకుంది. గుజరాత్ బౌలర్లలో వెటరన్ మోహిత్ శర్మ ఏకంగా నాలుగు వికెట్లతో చెలరేగాడు.
మహమ్మద్ షమీ, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్ కూడా తలో వికెట్ తీసుకున్నారు. ఇప్పటి వరకు గుజరాత్ ఆడిన 11 మ్యాచుల్లో ఇది ఆ టీంకు 8వ విజయం. దీంతో 16 పాయింట్లతో ప్లేఆఫ్స్ రేసులో గుజరాత్ జట్టు మరో ముందడుగు వేసింది. ఇదంతా చూస్తుంటే ఈ సీజన్లో కూడా ఈ జట్టే ముందుగా ప్లేఆఫ్స్ చేరేలా కనిపిస్తోంది.