గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్ ఘోరంగా ఓడింది. ఏకంగా 56 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ బ్యాటుతో అదరగొట్టింది. వృద్ధిమాన్ సాహా (81), శుభ్మన్ గిల్ (94 నాటౌట్) ఇద్దరూ ఆకాశమే హద్దుగా చెలరేగారు. దీంతో ఆ జట్టు ఏకంగా 227 పరుగుల భారీ స్కోరు చేసింది.
ఇంత భారీ టార్గెట్ను ఛేజ్ చేసే క్రమంలో లక్నో కూడా ఇన్నింగ్స్ను చక్కగానే ఆరంభించింది. కైల్ మేయర్స్ (48), క్వింటన్ డీకాక్ (70) ఇద్దరూ అదరగొట్టారు. కానీ ఆ తర్వాత లక్నో బ్యాటింగ్ లైనప్ తడబడింది. మూడో స్థానంలో వచ్చిన దీపక్ హుడా (11) చాలా నెమ్మదిగా ఆడాడు. దీంతో ఒత్తిడికి గురైన స్టొయినిస్ (4) కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేదు.

చివర్లో ఆయుష్ బదోనీ (21) ఫర్వాలేదనిపించినా.. నికోలస్ పూరన్ (3) మళ్లీ విఫలమయ్యాడు. దీంతో లక్నో టీం చాలా ఘోరంగా 56 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ ఓటమిపై స్పందించిన లక్నో కెప్టెన్ కృనాల్ పాండ్యా.. 'టార్గెట్ మరీ పెద్దగా ఉంది. 227 రన్స్ ఛేజ్ చేసేటప్పుడు ఒక్క ఓవర్ కూడా వేస్ట్ చెయ్యలేం. 200 ఛేజింగ్లో ఒకటి, రెండు ఓవర్లు నెమ్మదిగా ఆడినా పర్లేదు కానీ.. 227 ఛేజింగ్లో అలా జరిగితే చాలా కష్టం' అని చెప్పాడు.
'చివరి 6-7 ఓవర్లలో పిచ్ మరీ మందగించింది. కానీ వికెట్ బాగుందని బ్యాటర్లు చెప్పారు. వాళ్లను కనుక 200-210 పరుగులకు కట్టడి చేసి ఉంటే మాకు ఛాన్స్ ఉండేది. ఐపీఎల్లో నా టీంకు కెప్టెన్సీ చేస్తానని, అదీ హార్దిక్ను ఎదుర్కొంటానని కలలో కూడా అనుకోలేదు. కానీ రెండు పాయింట్లు ఇంటికే వచ్చాయని అమ్మ అంది. మా ఇద్దరి మధ్య చాలా అనుబంధం ఉంది' అని చెప్పుకొచ్చాడు.