డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ అదిరిపోయే విజయం సాధించింది. చివరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్లో లక్నో అనూహ్యంగా ఓటమిపాలైంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న గుజరాత్ టైటాన్స్ను లక్నో బౌలర్లు ముప్పుతిప్పలు పెట్టారు. ఒక్క బ్యాటర్ను కూడా స్వేచ్ఛగా ఆడనివ్వలేదు.
ఈ క్రమంలో గుజరాత్ కేవలం 135 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఛేజింగ్లో కైల్ మేయర్స్ (24) అద్భుతమైన ఆరంభం అందించాడు. అతనితోపాటు కేఎల్ రాహుల్ (68) కూడా మంచి స్కోరు చేశాడు. కృనాల్ పాండ్యా (23) ఫర్వాలేదనిపించాడు. కానీ చివరి ఐదు ఓవర్లలో గుజరాత్ బౌలింగ్ పూర్తిగా మారిపోయింది.

రాహుల్, పూరన్ (1) ఇద్దరికీ షాట్లు ఆడే అవకాశమే ఇవ్వలేదు. ఆ తర్వాత వచ్చిన ఆయుష్ బదోనీ (8), మార్కస్ స్టొయినిస్ (0), దీపక్ హుడా (2) కూడా వేగంగా ఆడే తొందరలో పెవిలియన్ చేరారు. చివరి ఓవర్లో రాహుల్ సహా నలుగురు బ్యాటర్లు అవుటయ్యారు. దీంతో లక్నో జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 128 పరుగులు మాత్రమే చేయగలిగింది.
అనంతరం మాట్లాడిన కేఎల్ రాహుల్.. ఈ ఓటమిని నమ్మలేకపోతున్నట్లు చెప్పాడు. 'ఏం మాట్లాడాలో తెలియడం లేదు. అసలు ఇలా ఎలా జరిగిందో అర్థం కావట్లేదు. చాలా వేగంగా పరిస్థితి మారిపోయింది. మ్యాచ్ ఎక్కడ మా చెయ్యి జారిందో చెప్పలేను. బౌలింగ్, ఫీల్డింగ్లో అద్భుతంగా రాణించాం. గుజరాత్ చేసిన స్కోరు ఈ పిచ్పై ఆశించిన స్కోరుకు ఒక 10 పరుగులు తక్కువే. పరిస్థితులను చక్కగా ఉపయోగించుకున్నాం' అని చెప్పాడు.
తాము ఛేజింగ్ కూడా బాగానే మొదలు పెట్టామని, అసలు ఇక్కడ ఏం జరిగిందో తెలియడం లేదని అన్నాడు. అయితే ఇది ఒక గేమ్ మాత్రమే అని, ఏడు మ్యాచుల్లో ఇప్పటికే నాలుగు విజయాలు తమ ఖాతాలో ఉన్నాయని ధీమా వ్యక్తం చేశాడు. మ్యాచ్ చివరి వరకు బ్యాటింగ్ చేయాలనే ఆలోచనే తనకు లేదన్నాడు. ఈ ఓటమి కొంత బాధ పెడుతుందని చెప్పాడు. గుజరాత్ స్పిన్నర్లు నూర్, జయంత్ ఇద్దరూ చివర్లో మూడు ఓవర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారని మెచ్చుకున్నాడు.
బ్యాటింగ్లో తాను కొన్ని ఛాన్సులు తీసుకొని, భారీ షాట్లు ఆడేందుకు ప్రయత్నించి ఉండాల్సిందని రాహుల్ అభిప్రాయపడ్డాడు. ఇది కొత్త బ్యాటర్లు రాగానే చెలరేగే వికెట్ కాదని, కాబట్టి సెట్ అయిన బ్యాటర్లే మ్యాచ్ ముగించి ఉండాల్సిందని చెప్పాడు. చివర్లో కొన్ని బౌండరీలు బాదే ఛాన్సులను మిస్ చేసుకున్నామని తెలిపాడు. వాటిని యూజ్ చేసుకొని ఉంటే ఫలితం వేరేలా ఉండేదని పేర్కొన్నాడు.