లక్నో సూపర్ జెయింట్స్తో జరుగుతున్న మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ జెయింట్స్ తేలిపోయింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న గుజరాత్.. లక్నో ముందు భారీ లక్ష్యాన్ని ఉంచాలని అనుకుంది. కానీ వాళ్ల బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. దీంతో ఆ జట్టు అనుకున్న స్కోరు చేయలేకపోయింది. గుజరాత్ బ్యాటర్లలో కెప్టెన్ హార్దిక్ పాండ్యా (66), వృద్ధిమాన్ సాహా (47) మాత్రమే రాణించారు.
మంచి ఫామ్లో ఉన్న శుభ్మన్ గిల్ (0) కేవలం రెండు బంతులే ఎదుర్కొని డకౌట్ అయ్యాడు. మిగతా బ్యాటర్లు కూడా ఏమాత్రం ఆకట్టుకోలేదు. అభినవ్ మనోహర్ (3), విజయ్ శంకర్ (10), డేవిడ్ మిల్లర్ (6), రాహుల్ తెవాటియా (2 నాటౌట్) పరుగులు మాత్రమే చేశారు. లక్నో బౌలర్లలో కృనాల్ పాండ్య అదరగొట్టాడు. గిల్, సాహా ఇద్దర్నీ అతనే అవుట్ చేశాడు. పవర్ప్లేలోనే బౌలింగ్ చేయడానికి వచ్చి లక్నోకు మంచి బ్రేక్ ఇచ్చాడు.

కృనాల్తో పాటు మార్కస్ స్టొయినిస్, అమిత్ మిశ్రా, నవీన్ ఉల్ హక్ కూడా వికెట్లు తీసుకున్నారు. దీంతో గుజరాత్ జట్టు క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. దీంతో వన్ డౌన్లో వచ్చినా కూడా హార్దిక్ స్వేచ్ఛగా ఆడలేకపోయాడు. దానికితోడు పిచ్ నుంచి బౌలర్లకు మంచి సహకారం కూడా లభించింది. ఈ కారణంగా అతను చాలా నెమ్మదిగా ఆడాల్సి వచ్చింది.
ఈ క్రమంలోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న అతను.. ఆ తర్వాత భారీ షాట్లు ఆడేందుకు ప్రయత్నించాడు. ముఖ్యంగా రవి బిష్ణోయిని టార్గెట్ చేసి సిక్సర్ల మీద సిక్సర్లు బాదాడు. కానీ 50 బంతుల్లో 66 పరుగులు చేసిన అతను.. మార్కస్ స్టొయినిస్ బౌలంగ్లో కూడా భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించి పెవిలియన్ చేరాడు. అంతకుముందే క్రీజులోకి వచ్చిన డేవిడ్ మిల్లర్ ఇంకా అప్పటికి క్రీజులో కుదురుకోలేదు.
చివరి బంతికి మిల్లర్ భారీ షాట్ ఆడబోయి అతను కూడా పెవిలియన్ చేరాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో గుజరాత్ జట్టు 7 వికెట్లు కోల్పోయి 135 పరుగులు మాత్రమే చేయగలిగింది. మంచి ఫామ్లో ఉన్న లక్నో బ్యాటింగ్ లైనప్ ముందు ఈ లక్ష్యాన్ని కాపాడుకోవడం గుజరాత్కు కత్తిమీద సామే. మరి గుజరాత్ ఎలా బౌలింగ్ చేస్తుందో చూడాలి.