టీ20 క్రికెట్ అంటే తొలి బంతి నుంచే బౌలర్లపై ఎదురు దాడికి దిగాలి. ఎడాపెడా బౌండరీలు బాదేయాలి. జట్టుకు భారీ స్కోరు అందించాలి. లేదంటే టార్గెట్ను ఇంకా బంతులు మిగిలుండగానే ఛేదించాలి. కానీ టీమిండియా వెటరన్ బ్యాటర్ కేఎల్ రాహుల్ మాత్రం దీనికి పూర్తి వ్యతిరేకం. ఓపెనర్గా వచ్చే అతనికి తొలి ఓవర్ మొత్తం ఒక్క పరుగు కూడా చేయకుండా ఉండటం సరదా.
అంతర్జాతీయ క్రికెట్లో అతని స్ట్రైక్ రేటుపై విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో.. రాహుల్ ఈ ఐపీఎల్లో రాణించడం చాలా కీలకం. రోహిత్, కోహ్లీ వంటి ఆటగాళ్లు కూడా వేగంగా ఆడేందుకు ప్రయత్నిస్తున్న ఈ సమయంలో.. రాహుల్ మాత్రం తొలి ఓవర్లు మెయిడెన్ ఆడటం అలవాటు చేసుకుంటున్నాడు. లక్నో ఆడిన చివరి మ్యాచ్లో కూడా తొలి ఓవర్ మెయిడెన్ ఆడాడు.

ఇప్పుడు గుజరాత్ టైటాన్స్తో జరుగుతున్న మ్యాచ్లో కూడా రాహుల్ ఇదే చేశాడు. ఈ మ్యాచ్లో పిచ్ నుంచి బౌలర్లకు మంచి సహకారం లభిస్తుండటంతో గుజరాత్ బ్యాటర్లు కూడా పెద్దగా స్కోర్లు చేయలేదు. ఇలాంటి సమయంలో 136 పరుగుల టార్గెట్తో లక్నో బరిలో దిగింది. ఓపెనర్గా వచ్చిన రాహుల్.. షమీ వేసిన మొదటి ఓవర్లో ఒక్క పరుగు కూడా చెయ్యలేదు.
ఇలా వరుసగా రెండు మ్యాచుల్లో తొలి ఓవర్ మెయిడెన్ ఆడిన రాహుల్పై నెటిజన్లు మండిపడుతున్నారు. టీమిండియా టీ20 జట్టు నుంచి తొలగించినా కూడా రాహుల్కు బుద్ధి రాలేదని ట్రోల్ చేస్తున్నారు. రాజస్థాన్పై ఇలా మెయిడెన్ ఆడినందుకు ఫ్యాన్స్ తిడుతుంటే.. మళ్లీ ఎలా ఆడావ్? అని నిలదీస్తున్నారు. అసలు ఇలా బంతులు మింగడానికే ఓపెనింగ్ చేస్తున్నావా? అంటున్నారు.
అయితే ఈ ఓవర్ తర్వాత నెమ్మదిగా ఇన్నింగ్స్ వేగం పెంచిన రాహుల్ వేగంగా ఆడాడు. ఈ క్రమంలోనే అత్యంత వేగంగా ఐపీఎల్లో 7 వేల పరుగుల మైలురాయి చేరుకున్న ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. దీంతో అతని ఫ్యాన్స్ కూడా నెట్టింట రెచ్చిపోతున్నారు. ట్రోలింగ్ చేసే వాళ్లందరికీ రాహుల్ అదిరిపయే సమాధానం ఇచ్చాడని అంటున్నారు.