లక్నో సూపర్ జెయింట్స్తో జరుగుతున్న మ్యాచ్లో గుజరాత్కు అదిరిపోయే ఆరంభం లభించింది. గుజరాత్ టైటాన్స్ ఓపెనర్గా గతేడాది నుంచి రాణిస్తున్న వృద్ధిమాన్ సాహా అదరగొట్టాడు. పవర్ప్లే ముగిసేలోపే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కేవలం 20 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసుకొని, గుజరాత్ తరఫున అత్యంత వేగంగా ఫిఫ్టీ చేసిన బ్యాటర్గా నిలిచాడు.
ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన లక్నో కెప్టెన్ కృనాల్ పాండ్యా ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. తమ వద్ద మంచి బౌలింగ్ యూనిట్ ఉందని నమ్మకం కనబరిచిన అతను.. ఇదే నమ్మకంతో ముందుగా బౌలింగ్ చేయాలని అనుకున్నాడు. కానీ సాహా, శుభ్మన్ గిల్ జోడీ ఈ నమ్మకంపై నీళ్లు కుమ్మరించింది. వీళ్లిద్దరూ ధనాధన్ షాట్లతో లక్నో బౌలర్లపై విరుచుకుపడ్డారు.

ఈ క్రమంలో గుజరాత్ జట్టు పవర్ప్లే ముగిసే సమయానికి వికెట్లేమీ కోల్పోకుండా 76 పరుగులు చేసింది. ముఖ్యంగా సాహా ఎడాపెడా బౌండరీలతో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఇదంతా చూసిన ఫ్యాన్స్ నోరెళ్లబెట్టారు. గతేడాది గుజరాత్కు మంచి ఆరంభాలు అందించిన అతను.. ఈ ఏడాది ఆరంభంలో కొంత తడబడ్డాడు. కానీ గత మ్యాచ్ నుంచి మళ్లీ తను గాడిలో పడినట్లు నిరూపిస్తున్నాడు.
ఇటీవలే బీసీసీఐ తమ కాంట్రాక్టెడ్ ప్లేయర్ల జాబితాను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ జాబితాలో సాహా పేరు లేదు. ప్రస్తుతం భవిష్యత్తుపై ఫోకస్ పెట్టిన టీమిండియా.. రిషభ్ పంత్ రిప్లేస్మెంట్గా కేఎస్ భరత్ను సెలెక్ట్ చేసుకుంది. ఈ క్రమంలోనే సాహా జట్టుకు దూరమయ్యాడు. కానీ ప్రస్తుతం అతను ఉన్న ఫామ్ చూస్తున్న చాలా మంది.. అతన్ని కూడా డబ్ల్యూటీసీ ఫైనల్కు సెలెక్ట్ చేయాలని అంటున్నారు.
కీలక ప్లేయర్లు అందరూ గాయాల బారిన పడటంతో డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడే భారత జట్టు బ్యాటింగ్ లైనప్ ఇప్పటికే బలహీనంగా మారింది. తాాజాగా కేఎల్ రాహుల్ కూడా ఈ మ్యాచ్కు దూరమయ్యాడు. ఈ క్రమంలో సాహాను జట్టులో చేరిస్తే మిడిలార్డర్లో చాలా ఉపయోగపడతాడని ఫ్యాన్స్ అంటున్నారు. మరి బీసీసీఐ ఏ ఆలోచన చేస్తుందో చూడాలి.