గుజరాత్ చేతిలో లక్నో సూపర్ జెయింట్స అనూహ్యంగా ఓటమి పాలైంది. మ్యాచ్ ఆరంభం నుంచే ఆధిపత్యం చెలాయించిన లక్నో.. చివరకు చేతులెత్తేసింది. లక్నో వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ను లక్నో బౌలర్లు తెగ ఇబ్బంది పెట్టారు. దీంతో గుజరాత్ బ్యాటర్లు తడబడ్డారు. అనుకున్నంత భారీ స్కోరు చేయలేకపోయారు. కేవలం 135 పరుగులే చేశారు.
ఈ స్వల్ప లక్ష్యాన్ని ఛేదించడంలో లక్నోకు మంచి ఆరంభం లభించింది. కైల్ మేయర్స్ మంచి ఆరంభం అందించాడు. ఈ క్రమంలో నిదానంగా ఇన్నింగ్స్ ఆరంభించిన కేఎల్ రాహుల్ కూడా ఆ తర్వాత జోరు పెంచాడు. కృనాల్ పాండ్యా (23)తో కలిసి మంచి భాగస్వామ్యం నెలకొల్పాడు. ఈ క్రమంలో 14 ఓవర్లకే 105 పరుగులు చేసింది. అంటే ఆ టీం గెలవాలంటే 36 బంతుల్లో 31 పరుగులు చేస్తే చాలు.

అప్పటికే హాఫ్ సెంచరీ చేసి క్రీజులో కుదురుకున్న రాహుల్ (68) క్రీజులో ఉన్నాడు. నికోలస్ పూరన్, మార్కస్ స్టొయినిస్ వంటి బిగ్ హిట్టర్లు రావలసి ఉంది. దీంతో ఆ టీం ఈజీగా గెలిచేస్తుందని అంతా అనుకున్నారు. కానీ ఏమైందో తెలీదు సడెన్గా లక్నో బ్యాటింగ్ తడబడింది. చివరి ఆరు ఓవర్లలో వరుసగా 1,3,4,6,5,4 పరుగులు మాత్రమే చేయగలిగింది. చివరి ఓవర్ వరకు క్రీజులో ఉన్న రాహుల్ కూడా తేలిపోయాడు.
అతని జిడ్డు బ్యాటింగ్ చూసిన ఫ్యాన్స్ మండి పడుతున్నారు. మరికొందరైతే ఈ మ్యాచ్ చూసిన తర్వాత ఐపీఎల్ అంతా ఫిక్సింగ్ అనిపిస్తోందని కామెంట్లు చేస్తున్నారు. క్రీజులో సెట్ బ్యాటర్ ఉండగా ఆరు ఓవర్లలో 30 పరుగులు చేయలేక ఓడిపోయారా? అంటూ లక్నోను నిలదీస్తున్నారు. ముఖ్యంగా రాహుల్ బ్యాటింగ్పై విమర్శలు చేస్తున్నారు. అతను కావాలనే మ్యాచ్ ఓడిపోయేలా చేశాడని అంటున్నారు. దీంతో నెట్టింట ఈ ఫిక్సింగ్ గోల తెగ వైరల్ అవుతోంది.