ఐపీఎల్ 16వ సీజన్ కూడా ఎన్నో ఉత్కంఠ భరిత మ్యాచులను ప్రేక్షకులకు చూపించింది. గతేడాది రెండు కొత్త జట్లు ఐపీఎల్లో చేరడంతో మరింత మంది కొత్త కుర్రాళ్లు తమ సత్తాను ప్రదర్శించే అవకాశం దక్కింది. అలాగే అంతర్జాతీయ ఆటగాళ్లతో డ్రెస్సింగ్ రూం పంచుకొని, వెల కట్టలేని అనుభవాలను ఈ కుర్రాళ్లు పోగు చేసుకుంటున్నారు. ఈ ఐపీఎల్ వల్లనే సూర్యకుమార్ యాదవ్ వంటి విధ్వంసకర టీ20 బ్యాటర్ గురించి ప్రపంచానికి తెలిసింది.
ఇప్పుడు మరో అద్భుతమైన ఫినిషర్గా రింకూ సింగ్ పేరు బయటకు వచ్చింది. గతేడాది లీగ్ దశలో కోల్కతా నైట్ రైడర్స్ ఆడిన చివరి మ్యాచ్లో రింకూ సింగ్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అంతకుముందు కూడా అద్భుతమైన ఫీల్డింగ్తో అందరి దృష్టినీ ఆకర్షించాడీ కుర్రాడు. ఇప్పుడు ఓడిపోయే మ్యాచ్లో ఒకే ఓవర్లో ఐదు భారీ సిక్సర్లు బాది గుజరాత్ టైటాన్స్పై తమ జట్టును గెలిపించాడు.

దీంతో అందరూ కూడా రింకూ సింగ్ సత్తాను మెచ్చుకుంటున్నారు. అతన్ని సానబెడితే భారత జట్టుకు అద్భుతమైన ఫినిషర్ దొరికినట్లే అని అందరూ అంటున్నారు. ఫ్యాన్స్ కూడా రింకూ సింగ్ సూపర్ అంటూ ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఇదే విషయాన్ని టీమిండియా సారధి రోహిత్ శర్మ కూడా చెప్పాడు. ఐపీఎల్లో సత్తా ఉన్న ఆటగాళ్లందరికీ అవకాశాలు లభిస్తాయనే మాటకు రింకూ సింగ్ ఒక ఉదాహరణ అని ట్వీట్ చేశాడు.
'నిజంగా సత్తాకు అవకాశం లభించే వేదిక ఐపీఎల్. రింకూ.. ఎవరూ నమ్మలేని ఇన్నింగ్స్ ఇది. ఇక యష్.. దీని నుంచి నేర్చుకోవాలి. ఇదొక చేదు అనుభవం అంతే' అని రోహిత్ పేర్కొన్నాడు. గతేడాది ఫినిషర్గా కొత్త కుర్రాడు ఆయుష్ బదోనీ కూడా అందరి దృష్టినీ ఆకర్షించాడు. బౌలర్లలో కూడా చెన్నై పేసర్ ముఖేష్ చౌదరి, మొహ్సిన్ ఖాన్ వంటి పేసర్లు కూడా ఐపీఎల్ వల్లనే గుర్తింపు పొందిన సంగతి తెలిసిందే.