గతేడాది ఐపీఎల్ ట్రోఫీ నెగ్గిన గుజరాత్ టైటాన్స్.. ఈ సీజన్లో కూడా అదే జోరు కొనసాగిస్తోంది. వరుస మ్యాచుల్లో విజయంతో అదరగొడుతోంది. ఈ క్రమంలోనే కోల్కతా నైట్ రైడర్స్తో తలపడేందుకు రెడీ అయింది. తమ చివరి మ్యాచ్లో ఢిల్లీని చిత్తు చేసిన గుజరాత్.. తమ సొంత మైదానంలో జరిగే మ్యాచ్లో కోల్కతాను కూడా చిత్తుగా ఓడించాలని ఉవ్విళ్లూరుతోంది.
అదే సమయంలో తమ అద్భుతమైన స్పిన్ బౌలింగ్తో బలమైన ఆర్సీబీపై ఘనవిజయం సాధించిన కేకేఆర్ కూడా.. ఎలాగైనా గుజరాత్ను ఓడించాలని పట్టుదలగా ఉంది. ఆర్సీబీతో మ్యాచ్లో కేకేఆర్ ప్రధాన ఆటగాళ్లు ఎవరూ రాణించలేదు. ఆండ్రీ రస్సెల్ గోల్డెన్ డక్గా పెవిలియన్ చేరాడు. బౌలింగ్ కూడా వేయలేదు. టిమ్ సౌథీ కూడా భారీగా పరుగులు ఇచ్చాడు. కానీ ఎవరూ ఊహించని విధంగా శార్దూల్ ఠాకూర్ అదిరిపోయే ఇన్నింగ్స్ ఆడాడు. సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి, సూయశ్ శర్మ అద్భుతంగా రాణించారు.

అహ్మదాబాద్ పిచ్ కూడా స్పిన్కు కొంత సహకారం అందిస్తుంది. దీంతో వీళ్లు అక్కడ కూడా రాణించే అవకాశం ఉంది. అది జరగాలంటే మాత్రం ముందుగా శుభ్మన్ గిల్ను అవుట్ చేయాలి. ఎందుకంటే అతను స్పిన్నర్లపై కూడా విరుచుకు పడే బ్యాటర్. అలాగే కేకేఆర్ను బాగా ఇబ్బంది పెడుతున్నది పేస్ బౌలర్లు. వాళ్లను ఎదుర్కోవడానికి కేకేఆర్ ప్రధాన బ్యాటర్లంతా తడబడుతున్నారు. గుజరాత్ వద్ద షమీ, లిటిల్, అల్జారీ జోసెఫ్ రూపంలో ప్రపంచ స్థాయి పేసర్లు ఉన్నారు.
అవసరమైతే కెప్టెన్ హార్దిక్ పాండ్యా కూడా బౌన్సర్లతో బెంబేలెత్తించేందుకు సిద్ధంగా ఉంటాడు. ఈ జట్టు వదులుకున్న లోకీ ఫెర్గూసన్, రహ్మనుల్లా గుర్బాజ్ ఇద్దరూ కేకేఆర్లో ఉన్నారు. వీళ్లిద్దరూ రాణించి తమ పాత ఫ్రాంచైజీకి తాము ఎంత విలువైన ఆటగాళ్లమో నిరూపించుకునే ప్రయత్నం చేయడానికి రెడీగా ఉన్నారు. కానీ ఈ ఐపీఎల్ సీజన్లో ఇప్పటి వరకు ఓటమెరుగని గుజరాత్ ఈ మ్యాచ్లో కూడా ఫేవరెట్గా బరిలో దిగుతోంది. గెలిచే అవకాశం కూడా గుజరాత్కే ఉన్నట్లు కనిపిస్తోంది.