ఐపీఎల్ పాయింట్ల పట్టికలో టేబుల్ టాపర్గా ఉన్న గుజరాత్కు టేబుల్ అట్టడుగున ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ షాకిచ్చింది. అహ్మదాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ను ఓడించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 130 పరుగులు మాత్రమే చేసింది.
ఢిల్లీ ఓపెనర్లు ఫిల్ సాల్ట్ (0), డేవిడ్ వార్నర్ (2) ఇద్దరూ ఘోరంగా ఫెయిలయ్యారు. ప్రియం గర్గ్ (10), మనీష్ పాండే (1), రైలీ రూసో (8) కూడా విఫలమయ్యారు. అయితే అక్షర్ పటేల్ (27), అమన్ హకీం ఖాన్ (53), రిపల్ పటేల్ (23) చక్కగా ఆడటంతో ఢిల్లీ కనీసం పోరాడగలిగే స్కోరు చేసింది.

ఛేజింగ్లో ఢిల్లీ బౌలర్లు చెలరేగారు. పవర్ప్లేలోనే నాలుగు వికెట్లు తీసుకున్నారు. దీంతో వృద్ధిమాన్ సాహా (0), శుభ్మన్ గిల్ (6), డేవిడ్ మిల్లర్ (0), విజయ్ శంకర్ (6) వరుసగా పెవిలియన్ చేరారు. ఈ క్రమంలో మరో వికెట్ పడకుండా హార్దిక్ పాండ్యా (59 నాటౌట్) అడ్డుగోడలా నిలిచాడు.
అభినవ్ మనోహర్ (26)తో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. చివర్లో ఆ టీం విజయం కష్టంగా మారింది. ఇలాంటి సమయంలో రాహుల్ తెవాటియా (7 బంతుల్లో 20) రెచ్చిపోయాడు. అతను మరోసారి గుజరాత్ను గెలిపించేలా కనిపించాడు. కానీ చివరి ఓవర్లో బంతి అందుకున్న ఇషాంత్ శర్మ.. అతన్ని అవుట్ చేశాడు.
చివర్లో తను స్ట్రైకింగ్ తీసుకొని హార్దిక్ ఏమైనా చేస్తాడని అనుకుంటే అతను కూడా ఏం చేయలేదు. దీంతో ఫ్యాన్స్ అతనిపై మండిపడుతున్నారు. ధోనీ అవుదామని తెగ ప్రయత్నిస్తున్న హార్దిక్.. కనీసం దినేష్ కార్తీక్ స్థాయి కూడా అందుకోలేకపోతున్నాడని తిడుతున్నారు.
ఈ మ్యాచ్లో 53 బంతులు ఎదుర్కొన్న హార్దిక్ 59 పరుగులు చేశాడు. అతను ఆడిన చివరి 13 బంతుల్లో ఒక్కటంటే ఒక్క బౌండరీ కూడా లేదు. ఇలా ప్రధాన బ్యాటర్ క్రీజులో ఉన్నా కూడా టీం ఓడిపోవడం గుజరాత్ ఫ్యాన్స్కు కూడా నచ్చలేదు. అందుకే హార్దిక్ను తెగ ట్రోల్ చేస్తున్నారు.
మైదానంలో అతి చేష్టలు చేస్తూ అందర్నీ తిడుతూ ఉండే హార్దిక్.. టీంను గెలిపించాల్సి వస్తే ఇలా ఆడతాడంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేఎల్ రాహుల్లా తయారయ్యాడని, అసలు హార్దిక్ క్రీజులో ఉండబట్టే టీం ఓడిపోయిందని కొందరు విమర్శలు చేస్తున్నారు.