ప్రస్తుతం ఐపీఎల్ పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్లో ఉన్న జట్టు గుజరాత్ టైటాన్స్. ఇదే పట్టికలో చిట్టచివరన ఉన్న టీం ఢిల్లీ క్యాపిటల్స్. ఈ రెండు జట్లు తలపడితే విజయం ఎవరికి దక్కుతుందని చెప్పాలంటే పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. అయితే ఐపీఎల్ జరిగేది టీ20 ఫార్మాట్లో అనే విషయం కూడా మర్చిపోకూడదు.
ఈ ఫార్మాట్లో ఏ జట్టయినా ఎలాంటి ప్రత్యర్థిపై అయినా గెలిచే అవకాశం ఉంది. సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవాలంతే. ఇప్పుడు ఢిల్లీ కూడా కరెక్ట్ నిర్ణయాలు తీసుకుంటే గుజరాత్ను ఓడించడం పెద్ద కష్టం కాదు. ప్రస్తుతం గుజరాత్ చాలా బలంగా కనిపిస్తోంది. ఓపెనర్గా గిల్ అద్భుతంగా రాణిస్తున్నాడు.

సాహా కూడా తనదైన రోజున భారీ ఇన్నింగ్స్ ఆడగలిగిన వాడే. ఇక విజయ్ శంకర్, హార్దిక్ పాండ్యా, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్ అందరూ మంచి ఫామ్లో ఉన్నారు. బౌలింగ్ విభాగంలో మహమ్మద్ షమీ, జోష్ లిటిల్ కూడా రాణిస్తున్నారు. ఇలా అన్ని విభాగాల్లో గుజరాత్ చాలా బలంగా కనిపిస్తోంది.
ఆ జట్టును ఓడించడం ఢిల్లీకి కష్టమే. అయితే డేవిడ్ వార్నర్ మంచి ఫామ్లో ఉన్నాడు. మిచెల్ మార్ష్ కూడా ఫామ్ అందుకున్నాడు. మనీష్ పాండే ఫర్వాలేదు అనిపిస్తుండగా.. అక్షర్ పటేల్ అద్భుతంగా ఆడుతున్నాడు. మిడిలార్డర్లో ఢిల్లీ కొంత బలహీనంగా ఉన్నా కూడా.. అక్షర్ పటేల్ను ముందు పంపిస్తే ఆ సమస్య తీరిపోతుంది.
బౌలింగ్ విభాగంలో కూడా ఢిల్లీ మెరుగ్గానే ఉంది. మార్ష్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ ప్రత్యర్థి బ్యాటర్లను కచ్చితంగా ఇబ్బంది పెడతారు. బ్యాటింగ్ కూడా క్లిక్ అయితే ఢిల్లీ విజయం సాధించడం పెద్ద కష్టం కాదు. అయితే గెలవాలంటే అక్షర్ పటేల్ను ఢిల్లీ సరిగా వాడుకోవాల్సిన అవసరం ఉంది. అతన్ని కొంచెం ముందుగా బ్యాటింగ్కు పంపితే కచ్చితంగా ఫలితం ఉంటుంది.