ఐపీఎల్లో ఆడిన 14 లీగ్ మ్యాచుల్లో పదింట జయభేరి మోగించిన గుజరాత్ అగ్రస్థానంలో లీగ్ దశను ముగించింది. ఇక గతేడాదితో పోలిస్తే అద్భుతంగా పుంజుకున్న చెన్నై పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది. ఈ రెండు జట్ల మధ్య చెపాక్ వేదికగా తొలి క్వాలిఫైయర్ జరగనుంది. ఈ మ్యాచ్లో రెండు జట్లు హోరా హోరీగా తలపడతాయని అనిపిస్తోంది.
రెండు బలమైన జట్ల మధ్య పోరు అంటే అందరూ ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తారు. ఈ క్రమంలోనే క్వాలిఫైయర్లో ఏ జట్టుకు ఎవరు బలం అని తెగ చర్చ జరుగుతోంది. ఈ జాబితాలో టీమిండియా లెజెండ్ వీరేంద్ర సెహ్వాగ్ కూడా ఉన్నాడు. తాజాగా తొలి క్వాలిఫైయర్ గురించి మాట్లాడిన సెహ్వాగ్.. గుజరాత్ జట్టులో ట్రంప్ కార్డ్ ఎవరో చెప్పాడు.

'గుజరాత్కు ట్రంప్ కార్డ్ రషీద్ ఖాన్. ఈ విషయంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు. ఆ జట్టు కనుక వికెట్లు తీసుకోవాలి అనుకుంటే అతను రంగంలోకి దిగాల్సిందే. అలాంటి రషీద్ను హార్దిక్ అద్భుతంగా ఉపయోగించుకుంటున్నాడు. అవతలి జట్టు మంచి భాగస్వామ్యాలు నెలకొల్పితే రషీద్ చూడలేడు. దాన్ని విడగొట్టే వరకు నిద్రపోడు' అని వివరించాడీ లెజెండ్.
ఈ సీజన్లో రషీద్ బెస్ట్ బౌలర్గా ఎదిగాడని సెహ్వాగ్ అన్నాడు. 'అద్భుతంగా రాణిస్తూ ఈ సీజన్లో సూపర్ పెర్ఫామర్గా ఎదిగాడు' అని మెచ్చుకున్నాడు. ఈ ఐపీఎల్లో ఆఫ్ఘన్ స్పిన్నర్ రషీద్ అదరగొడుతున్నాడు. ఇప్పటి వరకు 14 మ్యాచుల్లో 7.82 ఎకానమీతో 24 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నారు. మహమ్మద్ షమీతో పర్పుల్ క్యాప్ కోసం పోటీ పడుతున్నాడు.
చెపాక్ పరిస్థితులు కూడా రషీద్ బౌలింగ్కు చాలా సహకరిస్తుంది. ఈ క్రమంలో గుజరాత్ ఈ మ్యాచ్లో రషీద్ ఖాన్పై మరీ ఎక్కువ ఆధార పడేలా కనిపిస్తోంది. అలాగే మరో ఆఫ్ఘన్ స్పిన్నర్ నూర్ అహ్మద్ కూడా ఈ మ్యాచ్లో కీలకం కానున్నాడు. మరి ఈ మ్యాచ్లో రషీద్ ఏ మేరకు ఆకట్టుకుంటాడో చూడాలి.