ఐపీఎల్లో ఆడిన 14 లీగ్ మ్యాచుల్లో పదింట జయభేరి మోగించిన గుజరాత్ అగ్రస్థానంలో లీగ్ దశను ముగించింది. ఇక గతేడాదితో పోలిస్తే అద్భుతంగా పుంజుకున్న చెన్నై పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది. ఈ రెండు జట్ల మధ్య చెపాక్ వేదికగా తొలి క్వాలిఫైయర్ జరగనుంది. ఈ మ్యాచ్లో రెండు జట్లు హోరా హోరీగా తలపడతాయని అనిపిస్తోంది.
ఇప్పటి వరకు ఐపీఎల్లో ఈ రెండు జట్లు మూడు సార్లు తలపడ్డాయి. ఈ మూడు మ్యాచుల్లో గుజరాతే గెలిచింది. దీంతో ఈ మ్యాచ్లో కూడా గుజరాత్ ఫేవరెట్ అని చాలా మంది ఫీల్ అవుతున్నారు. అయితే చెన్నైని చెపాక్లో తక్కువ అంచనా వేస్తే దెబ్బతింటారని మరికొందరు వార్నింగులు ఇస్తున్నారు.

ఇలాంటి కీలక మ్యాచ్కు ముందు గుజరాత్ సారధి హార్దిక్ పాండ్యా కీలక వ్యాఖ్యలు చేశాడు. దీనికి సంబంధించిన వీడియోను గుజరాత్ టైటాన్స్ తమ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ధోనీతో తనకు ఉన్న బంధం గురించి కూడా హార్దిక్ మాట్లాడాడు. ధోనీ పెద్దగా సీరియస్గా ఉంటాడని అంతా అనుకుంటారని, కానీ ధోనీ అలాంటి వాడు కాదని అన్నాడు.
'చాలా మంది ధోనీని చూసి పెద్ద సీరియస్ మేళం అనుకుంటారు. కానీ నాకు అలా కాదు. నేను తనతో తెగ జోకులు వేస్తా. మహేంద్ర సింగ్ ధోనీ అని కూడా చూడకుండా తెగ కామెడీ చేస్తా. తన గురించి చెప్పడానికి చాలా పాజిటివ్ విషయాలు ఉంటాయి. నేను ధోనీ భాయ్ నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నా' అని చెప్పాడు.
అలాగే ధోనీతో మాట్లాడకపోయినా కూడా.. తనను చూస్తూ కూడా చాలా గొప్ప విషయాలు నేర్చుకోవచ్చని పాండ్యా అన్నాడు. 'అయితే నాకు మాత్రం తను నా బెస్ట్ ఫ్రెండ్, నేను కామెడీ చేస్తూ ఉండే నా మంచి బ్రదర్. నేను ఎప్పటికీ మహేంద్ర సింగ్ ధోనీ అభిమానిగానే ఉండిపోతా. చాలా మంది ఫ్యాన్స్ కూడా అంతే. ధోనీని ఎవరైనా ఇష్టపడటం లేదు, ద్వేషిస్తున్నారు అంటే వాళ్లు చాలా పెద్ద రాక్షసులు అయ్యుండాలి' అని పేర్కొన్నాడు.