ఐపీఎల్ తొలి మ్యాచ్కు అంతా సిద్ధమైంది. గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు అహ్మదాబాద్ వేదికగా తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో రెండు జట్లలో ప్రధాన బౌలర్లు చెలరేగేందుకు, ప్రత్యర్థి బ్యాటర్లకు ముచ్చెమటలు పట్టించేందుకు రెడీ అవుతున్నారు. ఈ క్రమంలో ఈ మ్యాచ్లో అత్యధిక వికెట్లు తీసేందుకు రెడీగా ఉన్న బౌలర్లు ఎవరని ఫ్యాన్స్ మధ్య తెగ చర్చ జరుగుతోంది. మరి ఈ మ్యాచ్లో చెలరేగే బౌలర్ల వివరాలు ఒకసారి చూస్తే..
మహమ్మద్ షమీ
గుజరాత్ టైటాన్స్ గతేడాది ఐపీఎల్ ట్రోఫీ నెగ్గడంలో మహమ్మద్ షమీ చాలా కీలక పాత్ర పోషించాడు. మొత్తం 16 మ్యాచుల్లో 20 వికెట్లు తీసుకున్నాడతను. దేశవాళీల్లో కూడా రాణించాడు. ఈ క్రమంలో ఈసారి కూడా గుజరాత్ విజయాల్లో షమీ పాత్ర కీలకం కానుంది. అతను కనుక తన రిథమ్ అందుకుంటే.. చెన్నై బ్యాటర్లకు తిప్పలు తప్పవు. సరైన లైన్ అండ్ లెంగ్త్తో బంతులు వేస్తూ పవర్ప్లే, డెత్ ఓవర్లలో కూడా షమీ బౌలింగ్ చాలా కీలకం.

దీపక్ చాహర్
గతేడాది గాయం కారణంగా ఐపీఎల్కు దూరమైన పేసర్ దీపక్ చాహర్. ఎక్కువగా పవర్ ప్లేలో వికెట్లు తీసుకుంటాడని దీపక్ చాహర్కు పేరుంది. అయితే ఎంఎస్ ధోనీ మాత్రం చాహర్ను మిడిల్ ఓవర్లు, డెత్ ఓవర్లలో కూడా చక్కగా యూజ్ చేసుకున్నాడు. ఇప్పటి వరకు తన ఐపీఎల్ కెరీర్లో 59 వికెట్లు తీసుకున్న చాహర్.. ఈ ఏడాది తన పునరాగమనాన్ని ఘనంగా చాటుకోవాలని ఎదురు చూస్తున్నాడు. అంతకుముందు సౌతాఫ్రికాతో టీ20 మ్యాచులో కూడా చాహర్ చెలరేగిన సంగతి తెలిసిందే.
రషీద్ ఖాన్
పొట్టి ఫార్మాట్లో ప్రపంచంలో బెస్ట్ బౌలర్లలో రషీద్ ఖాన్ ఒకడు. తాజాగా అఫ్ఘానిస్తాన్ కెప్టెన్సీ బాధ్యతలు కూడా అందుకున్న ఈ స్టార్ స్పిన్నర్.. ముఖ్యంగా మిడిల్ ఓవర్లలో ప్రత్యర్థి బ్యాటర్లను తెగ ఇబ్బంది పెట్టేస్తాడు. కొన్ని రోజుల క్రితం పాకిస్తాన్పై టీ20 సిరీస్లో నెగ్గిన అఫ్ఘాన్ జట్టుకు రషీద్ కెప్టెన్సీ బాధ్యతలు నిర్వర్తించాడు. ఐపీఎల్లో కూడా చెలరేగే రషీద్.. ఇప్పటి వరకు 92 మ్యాచుల్లో 112 వికెట్లు తీసుకున్నాడు. ఈ మ్యాచ్లో కూడా రషీద్ చెలరేగే అవకాశం ఉంది.