క్రికెట్ పండుగ ఐపీఎల్ 16వ సీజన్ మొదలైంది. తొలి మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ గట్టిగా పోటీ పడ్డాయి. ఈ మ్యాచ్ చూసిన వాళ్లందరూ తెగ ఎంజాయ్ చేశారు. ఈ మ్యాచ్ టీవీలో స్టార్ స్పోర్ట్స్ ఛానెల్లో ప్రత్యక్ష ప్రసారమైంది. ఈ ఛానెల్లో మ్యాచ్ ఎంజాయ్ చేసిన వారికి ఒక షాకింగ్ తెలియలేదు. అదేంటంటే.. మ్యాచ్ మధ్యలో కామెంటేటర్స్ అంతా కలిసి అప్పటి వరకు జరిగిన మ్యాచ్ను విశ్లేషించిన సంగతి తెలిసిందే.
ఆ సమయంలో ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ స్టీవ్ స్మిత్ కూడా మిగతా కామెంటేటర్లతో పాటు తన అభిప్రాయాలు వెల్లడించాడు. ముగ్గురు కామెంటేటర్లు తమ ఆలోచనలను ప్రేక్షకులతో పంచుకున్నారు. ఇదంతా స్టూడియోలోనే జరిగినట్లు మనందరికీ కనిపించింది. కానీ స్టీవ్ స్మిత్ భారత్కు రాలేదని ఎంత మందికి తెలుసు? అంటే అతను స్టార్ స్పోర్ట్స్ స్టూడియోలో అడుగే పెట్టలేదు. ఈ కామెంటరీ చెప్పే సమయంలో అతను ఆస్ట్రేలియాలోనే ఉన్నాడట. అత్యాధునిక హాలోగ్రామ్ టెక్నాలజీని ఉపయోగించి స్మిత్ కూడా స్టూడియోలోనే ఉన్నట్లు స్టార్ స్పోర్ట్స్ సృష్టించింది.

ఈ విషయం స్మిత్కు కూడా తెలియదట. తను కూడా స్టూడియోలోనే ఉన్నట్లు టీవీలో వస్తోందని తెలిసి స్మిత్ షాకైపోయాడట. ఏదేమైనా టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కడం అంటే ఇదే కదా. మ్యాచ్ చూసిన ఎవరూ కూడా ఈ విషయాన్ని కనీసం గుర్తించలేకపోయారు. కాగా, తను కూడా ఈసారి ఐపీఎల్లో భాగం అవుతున్నానని కొన్ని రోజుల క్రితం వెల్లడించిన స్టీవ్ స్మిత్.. తను కామెంటేటర్ అవతారం ఎత్తుతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.
అప్పుడు చెప్పినట్లే తొలి మ్యాచ్ సందర్భంగా కామెంటరీ ప్యానెల్లో స్మిత్ కూడా ఆకట్టుకున్నాడు. అయితే ఈ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ గాయపడిన సంగతి తెలిసిందే. ఈ గాయం తీవ్రమైంది కావడంతో కేన్ మామ ఈ ఐపీఎల్ సీజన్కు దూరమైనట్లు సమాచారం. దీంతో అతని స్థానంలో రిప్లేస్మెంట్గా గుజరాత్ ఫ్రాంచైజీ.. స్మిత్ను తీసుకునే అవకాశం ఉన్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఈ విషయంలో గుజరాత్ జట్టు నుంచి అధికారికంగా ఎలాంటి ప్రకటనా రాలేదు.