నాలుగు సార్లు ఐపీఎల్ ట్రోఫీ నెగ్గిన చెన్నై సూపర్ కింగ్స్.. ఈ ఏడాది ఐపీఎల్ 16వ సీజన్ను ఓటమితో ప్రారంభించింది. అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్తో చెన్నై తలపడింది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఆ జట్టుకు సరైన ఓపెనింగ్ దొరకలేదు. ఓపెనర్ డెవాన్ కాన్వే (1) విఫలమయ్యాడు. అయితే యంగ్ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (92) మాత్రం ఆకాశమే హద్దుగా చెలరేగాడు.
గైక్వాడ్ రెచ్చిపోవడంతో చెన్నై ఈజీగా 200 పైచిలుకు రన్స్ చేస్తుందని ఫ్యాన్స్ అనుకున్నారు. కానీ అలా జరగలేదు. మిడిలార్డర్లో వచ్చిన ఒక్కరు కూడా భారీ షాట్లు ఆడలేకపోయారు. అంబటి రాయుడు (12), శివమ్ దూబే (19), బెన్ స్టోక్స్ (7), జడేజా (1) ఘోరంగా విఫలమయ్యారు. దీంతో చెన్నై జట్టు రన్ రేట్ దారుణంగా పడిపోయింది. చివర్లో ధోనీ (7 బంతుల్లో 14 నాటౌట్) మెరుపులతో ఆ జట్టు 178/7 స్కోరు చేసింది.

ఈ లక్ష్యాన్ని కాపాడుకోవడానికి ధోనీ జట్టు చాలా కష్టపడింది. కానీ అరంగేట్ర ఆటగాడు హంగ్రేకర్ (3/36) మినహా మిగతా బౌలర్లు కూడా పెద్దగా ఆకట్టుకోలేదు. ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చిన తుషార్ దేశ్పాండే.. కీలకమైన గిల్ వికెట్ తీసినా కూడా భారీగా పరుగులు ఇచ్చుకున్నాడు. దీంతో గుజరాత్ జట్టునే విజయం వరించింది. చెన్నై ఓటమికి బ్యాటింగ్లో మిడిలార్డర్ వైఫల్యం ప్రధాన కారణం అని నిపుణులు చెప్తున్నారు.
మిడిలార్డర్ కనుక గైక్వాడ్కు సరైన సహకారం అందించి ఉంటే.. ఆ జట్టు కచ్చితంగా 200పైగా పరుగులు చేసేదని అంటున్నారు. అలాగే బౌలింగ్లో దీపక్ చాహర్ తేలిపోవడం, జడేజా పెద్దగా ప్రభావం చూపలేకపోవడం కూడా చెన్నై కొంప ముంచింది. ఇక ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చిన తుషార్ దేశ్పాండే కేవలం 3.2 ఓవర్లలోనే 51 పరుగులు ఇవ్వడం కూడా మూలిగే నక్కపై తాటికాయ పడినట్లయింది. అతను పరుగులను ఏమాత్రం కట్టడి చేయలేకపోయాడు.