ఐపీఎల్ 16వ సీజన్ తొలి మ్యాచ్లో హిస్టరీ రిపీట్ అయింది. గతేడాది రెండు సార్లు గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓడిన చెన్నై సూపర్ కింగ్స్.. ఈ ఏడాది ఆరంభ మ్యాచులో కూడా డిఫెండింగ్ ఛాంపియన్ చేతిలో ఓటమిపాలైంది. సీఎస్కే యువ ప్రభంజనం రుతురాజ్ గైక్వాడ్ (92) రాణించినా కూడా మిగతా బ్యాటర్లు పెద్దగా రాణించలేదు. చివర్లో ధోనీ (7 బంతుల్లో 14 నాటౌట్) ధనాధన్ ఇన్నింగ్స్ ఆడటంతో చెన్నై 178 పరుగుల స్కోరు సాధించింది.
ఈ లక్ష్యాన్ని ఛేజ్ చేసే క్రమంలో గుజరాత్కు ఓపెనర్ శుభ్మన్ గిల్ (63) అదిరిపోయే ఆరంభం అందించాడు. తను కెరీర్ బెస్ట్ ఫామ్లో ఉన్న విషయాన్ని మరోసారి రుజువు చేసుకున్నాడు. అయితే ఆ తర్వాత వచ్చిన ఏ బ్యాటరూ అనుకున్న స్థాయిలో రాణించలేదు. సాయి సుదర్శన్ (22), విజయ్ శంకర్ (27) ఫర్వాలేదనిపించారు. అయితే చివర్లో రషీద్ ఖాన్ (3 బంతుల్లో 10 నాటౌట్) చెలరేగడంతో లక్ష్యాన్ని 19.2 ఓవర్లలోనే గుజరాత్ ఛేదించింది.

ఈ విజయం అనంతరం గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా సంతోషం వ్యక్తం చేశాడు. అదే సమయంలో తామే జట్టు పైకి కష్టాలు కొని తెచ్చుకున్నామని చెప్పాడు. 'నేను కచ్చితంగా సంతోషంగానే ఉన్నా. కానీ మాకు మేమే కఠిన పరిస్థితులు కొని తెచ్చుకున్నాం. ఒక సమయంలో చెన్నై 200 పైగా స్కోరు చేసేలా కనిపించింది. దాన్ని 178 పరుగులకే కట్టడి చేసినందుకు ఆనందంగా ఉంది. కీలక సమయాల్ల వికెట్లు తీసుకోవడంతోనే ఇది సాధ్యమైంది' అని హార్దిక్ వివరించాడు.
ఈ ఏడాది కొత్తగా తీసుకొచ్చిన ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ వల్ల తన కెప్టెన్సీ చాలా కష్టంగా మారుతోందని పాండ్యా అన్నాడు. 'ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ వల్ల నాకు చాలా ఆప్షన్స్ దొరుకుతున్నాయి. ఏది సెలెక్ట్ చేసుకోవాలో తెలియక తెగ ఆలోచించాల్సి వస్తోంది. దీని వల్ల ఎవరో ఒకరు తక్కువ ఓవర్లు బౌలింగ్ చేయడమో, ఆలస్యంగా బంతి అందుకోవడమో సహజం. అలాగే బ్యాటింగ్లో నేను, గిల్ అవుటైన షాట్ల వల్ల జట్టు మొత్తం ఇబ్బందుల్లో పడింది. ఇది కరెక్ట్ కాదు' అని పాండ్యా చెప్పుకొచ్చాడు.
తమ డ్రెస్సింగ్ రూంలో ఒక నిబంధన పెట్టుకొని ఆడుతున్నామని, కానీ తాను అవుటైన విధానం ఈ రూల్ బ్రేక్ చేసిందని పాండ్యా వెల్లడించాడు. 'డ్రెస్సింగ్ రూంలో మాకంటూ కొన్ని స్టాండర్డ్స్ ఉన్నాయి. క్రీజులో కుదురుకున్న వాళ్లే మ్యాచ్ ముగించాలి. అది ఒక రూల్. కానీ మేం అది చేయలేకపోయాం. ప్రతిసారీ రషీద్, రాహుల్ మీదనే ఈ భారం వేయడం సమంజసం కాదు కదా' అని పాండ్యా పేర్కొన్నాడు.