క్రికెట్ ప్రపంచంలో ఎంఎస్ ధోనీ గురించి తెలియని వాళ్లుండరు. ఐపీఎల్ ఆరంభం నుంచి ఆడుతున్న ధోనీకి ఈ 16వ సీజన్ చివరిది అని వార్తలు వస్తున్నాయి. అదే సమయంలో తొలి మ్యాచ్కు ముందు ధోనీ మోకాలికి గాయమని, అతను మ్యాచ్ ఆడటం లేదని వార్తలు వచ్చాయి. అయితే ఆ గాయం అంత పెద్దది కాకపోవడం ధోనీ మైదానంలో దిగాడు. బ్యాటింగ్ చేసే సమయంలో కూడా తన స్టైల్లో ఆడాడు.
కేవలం ఏడు బంతుల్లోనే 14 పరుగులతో అజేయంగా నిలిచాడు ధోనీ. ఫీల్డింగ్ సమయంలో కూడా మైదానంలో కంఫర్టబుల్గానే కనిపించాడు. అయితే దీపక్ చాహర్ వేసిన 19వ ఓవర్లో ధోనీ గాయం తీవ్రత అందరికీ అర్ధమైంది. రాహుల్ తెవాటియా బ్యాటింగ్ చేస్తుండగా.. చాహర్ అతని లెగ్ సైడ్ బంతిని వేశాడు. అది తెవాటియా ప్యాడ్లను తాకి వెనక్కు వెళ్లింది దాన్ని ఆపేందుకు ధోనీ తన అలవాటులో కుడివైపు డైవ్ చేశాడు.

ఇలా డైవ్ చేసినప్పుడు ధోనీ ఎడమ మోకాలు బలంగా నేలను తాకింది. దాన్ని ఎవరూ సీరియస్గా తీసుకోలేదు. కానీ ధోనీ మాత్రం నొప్పితో విలవిల్లాడాడు. సరిగా నిలబడలేకపోయాడు. దీంతో ఫిజియో వచ్చి అతనికి చికిత్స చేశాడు. ఆ తర్వాత కేవలం ఏడు బంతుల ఆట మాత్రమే జరిగింది. దీంతో ధోనీ గాయం తీవ్రత ఎంత ఉందో ఎవరికీ తెలియడం లేదు. కానీ ధోనీ అభిమానులు మాత్రం అతను ఇలా మైదానంలో నొప్పితో విలవిల్లాడటం ఎప్పుడూ చూడలేదని అంటున్నారు.
ధోనీ గతంలో తీవ్రమైన వెన్నునొప్పితో బ్యాటింగ్ చేశాడు. అలాగే కంటి దగ్గర దెబ్బ తగలడంతో కన్ను మసకబారినా ఆడాడు. కానీ ఎప్పుడూ ఇలా మైదానంలో నొప్పితో బాధ పడటం ఎవరి కంట పడలేదు. ఇదే విషయాన్ని కామెంటరీ బాక్సులో ఉన్న రవిశాస్త్రి కూడా చెప్పాడు. 'ఎంఎస్ ధోనీ నేరుగా ఆ మోకాలిపైనే పడ్డాడు. అతని మొఖంలో బాధ చూడండి' అని రవిశాస్త్రి అన్నాడు. దీంతో చెపాక్లో జరిగే మ్యాచ్లో ధోనీ ఆడతాడో లేదో అని ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు.