టీ20 ఫార్మాట్లో చివరి బంతి వరకు బ్యాటర్లు పోరాడాల్సిందే. ఎందుకంటే చివరి బంతికి చేసే పరుగులే మ్యాచ్ ఫలితాన్ని శాసించే అవకాశం ఉంటుంది. అందుకే ఈ ఫార్మాట్లో ఫినిషర్ పాత్రకు చాలా ప్రాధాన్యం ఉంది. ఈ పొజిషన్లో క్రికెట్లో బెస్ట్ ఎవరైనా ఉన్నారంటే అతను ఎంఎస్ ధోనీనే. ఈ విషయం ఐపీఎల్లో కూడా రుజువైంది. ఐపీఎల్ ఆరంభం నుంచి ఆడుతున్న అతను.. చివరి ఓవర్లో క్రీజులో ఉంటే ఎంతటి విధ్వంసం సృష్టిస్తాడో వేరే చెప్పాల్సిన అవసరం లేదు.
ఐపీఎల్ 16వ సీజన్ తొలి మ్యాచ్లో కూడా ఈ విషయం స్పష్టమైంది. చివరి ఓవర్లో బ్యాటింగ్ చేసిన అతను ఏడు బంతుల్లోనే 14 పరుగులు చేశాడు. అంతేకాదు ఇప్పటి వరకు ఐపీఎల్ లో చివరి ఓవర్లో ఎక్కువ సిక్సర్లు బాదిన బ్యాటర్ గా రికార్డ్ సృష్టించాడు. ఇప్పటి వరకు ధోనీ కేవలం 20వ ఓవర్లోనే ఏకంగా 53 సిక్సర్లు బాదాడు. మరే క్రికెటర్ కూడా చివరి ఓవర్లో ఇన్ని సిక్సర్లు కొట్టలేదు.

ధోనీ తర్వాత ఈ జాబితాలో రెండో స్థానంలో విండీస్ వీరుడు కీరన్ పోల్లార్డ్ ఉన్నాడు. గతేడాది వరకు ముంబై ఇండియన్స్ జట్టులో చాలా కీలకంగా ఉన్న అతను.. పలు మ్యాచుల్లో ఆ జట్టును చివరి ఓవర్లో గెలిపించాడు. ఈ క్రమంలో తన ఐపీఎల్ కెరీర్లో కేవలం 20వ ఓవర్లోనే 33 సిక్సర్లు బాదాడు. అతని తర్వాత ఈ జాబితాలో చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా ఉన్నాడు.
గతేడాది ఐపీఎల్ ఆరంభంలో చెన్నై జట్టుకు కెప్టెన్సీ బాధ్యతలు కూడా నిర్వహించిన జడ్డు.. ఐపీఎల్ లో చెన్నైకి ఎన్నో విజయాలు అందించాడు. ఈ క్రమంలో చివరి ఓవర్లో అతను 26 సికర్లు బాదాడు. గుజరాత్ టైటాన్స్ సారథి హార్డిక్ పాండ్య ఈ జాబితాలో నాలుగో స్థానంలో ఉన్నాడు. అతను 20వ ఓవర్లో 25 సిక్సర్లు కొట్టాడు. ఇదే క్రమంలో చివరి ఓవర్లో 23 సిక్సర్లతో ముంబై ఇండియన్స్ సారథి రోహిత్ శర్మ ఈ జాబితాలో ఐదో స్థానంలో నిలిచాడు.