ఐపీఎల్ పదహారో పడిలో అడుగు పెడుతోంది. ఈ సీజన్కు చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ పోరుతో నాంది పలకనుంది. అయితే ఈ మ్యాచ్లో సీఎస్కే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఆడటం లేదనే వార్తలు తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఎడమ మోకాలి గాయంతో ధోనీ బాధ పడుతున్నట్లు తెలుస్తోంది. ప్రాక్టీస్ సమయంలో కూడా అతను కుంటుకుంటూ నడవడం అభిమానుల కళ్లపడింది. దీంతో అతను తొలి మ్యాచ్ ఆడటం లేదనే వార్తలు జోరందుకున్నాయి.
మోకాలి నొప్పితో బాధ పడుతున్న 41 ఏళ్ల ధోనీ.. అనవసరంగా రిస్క్ తీసుకోవడం ఎందుకని అనుకుంటున్నాడట. దీంతో తొలి మ్యాచ్కు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నాడని వార్తలు వినిపించాయి. ధోనీ కనుక ఈ మ్యాచ్ ఆడకపోతే జట్టు పగ్గాలను బెన్ స్టోక్స్కు అందించే ఛాన్స్ ఉంది. అదే సమయంలో దేశవాళీల్లో మహారాష్ట్ర జట్టుకు కెప్టెన్సీ వహించిన రుతురాజ్కు కూడా కెప్టెన్సీ అవకాశం ఇవ్వొచ్చు. అతన్ని ఫ్యూచర్ కెప్టెన్గా తయారు చేయడానికి ఈ అవకాశం ఉపయోగపడుతుందని కొందరు చెప్తున్నారు.

అయితే చెన్నై వద్ద ఎక్కువ మంది కీపర్లు లేరు. ధోనీ తప్పుకుంటే వికెట్ కీపింగ్ నిఖార్సయిన ప్లేయర్ ఆ జట్టులో లేరు. వికెట్ కీపింగ్ ఎవరు పడితే వాళ్లు చేయలేరు. దానికోసం ప్రత్యేకంగా శిక్షణ అవసరం అని తెలిసిందే. అందుకే గతేడాది చివర్లో జరిగిన మినీ వేలంలో కేఎస్ భరత్ను కొనుగోలు చేయడానికి చెన్నై గట్టి పోటీ పడింది. కానీ అతన్ని గుజరాత్ టైటాన్స్ ఏకంగా రూ.1.2 కోట్లకు ఎగరేసుకుపోయింది. దీంతో చెన్నై వద్ద సరైన వికెట్ కీపింగ్ ఆప్షన్ లేదు.
ఈ నేపథ్యంలో ధోనీ కనుక తప్పుకుంటే చెన్నై వికెట్ కీపర్గా అయితే అంబటి రాయుడు, లేదంటే కివీస్ ఓపెనర్ డెవాన్ కాన్వేకు బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. వీళ్లిద్దరూ ఆ జట్టు వద్ద ఉన్న కీపింగ్ ఆప్షన్లు. అయితే అసలు ఇలాంటి సమస్యే జట్టులో లేదని సీఎస్కే సీఈవో కాశీ విశ్వనాథన్ కొట్టిపారేశాడు. తనకు తెలిసినంత వరకు ధోనీ పూర్తి ఫిట్గా ఉన్నాడని, అతను నూటికి నూరు శాతం తొలి మ్యాచ్ ఆడతాడని తేల్చిచెప్పాడు. దీంతో ధోనీ ఆడటంపై అనుమానాలు తీరినట్లేనని ఫ్యాన్స్ భావిస్తున్నారు.