GT vs SRH: గుజరాత్ టైటాన్స్ జట్టు అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో నేడు తలపడనుంది. వైభవ్ సూర్యవంశీ రికార్డు సెంచరీ వల్ల రాజస్థాన్ రాయల్స్ చేతిలో పరాజయం పాలైన గుజరాత్ జట్టు.. తిరిగి జోరును కొనసాగించాలని చూస్తోంది. ఐపీఎల్ 2025 చివర దశకు చేరుకుంటున్న తరుణంలో గుజరాత్ టైటాన్స్ ప్లేఆఫ్స్కు చేరుకునే దిశగా పయనిస్తోంది. ఇప్పుడు ఒత్తిడిలో ఉన్న సన్రైజర్స్ హైదరాబాద్పై తమ స్థానాన్ని పదిలం చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది.
హైదరాబాద్ గుజరాత్ చేతిలో ఓడితే..?
గుజరాత్ టైటాన్స్ 9 మ్యాచ్ల్లో 6 విజయాలతో పాయింట్ల పట్టికలో 4వ స్థానంలో ఉంది. ఆ జట్టు ప్లేఆఫ్స్ కు చేరుకోవడానికి మిగిలిన 5 మ్యాచ్ల్లో ఇంకా రెండు గెలిస్తే చాలు. ఇక సన్రైజర్స్ హైదరాబాద్ విషయానికి వస్తే ప్రతి మ్యాచ్ డూ ఆర్ డై లాగే ఆడాల్సి ఉంటుంది. సన్రైజర్స్ హైదరాబాద్ 9 మ్యాచ్ల్లో కేవలం 3 విజయాలతో పాయింట్ల పట్టికలో 9వ స్థానానికి పడిపోయి ఎలిమినేషన్ అంచున ఉంది. ఈ రోజు జరిగే డూ ఆర్ డై మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ ఓడితే ఐపీఎల్ ప్లేఆఫ్స్ నుంచి నిష్క్రమించాల్సిందే.

బలంగా ఉన్న గుజరాత్..
గుజరాత్ టైటాన్స్ టాప్ ఆర్డర్ చాలా బలంగా ఉంది. ప్రస్తుత ఆరెంజ్ క్యాప్ హోల్డర్ సాయి సుదర్శన్ బ్యాటింగ్ లో నిలకడగా రాణిస్తున్నాడు. 5 అర్థ శతకాలతో 456 పరుగులు చేశాడు. సాయి సుదర్శన్కు కెప్టెన్ శుభ్మన్ గిల్(389 పరుగులు), జోస్ బట్లర్(406 పరుగులు) మంచి మద్దతు ఇస్తున్నారు. వీరిద్దరూ లీగ్ లో టాప్ స్కోరర్లలో ఉన్నారు. బౌలింగ్ విభాగంలో ప్రసిద్ధ్ కృష్ణ, మహ్మద్ సిరాజ్, ఇషాంత్ శర్మ అద్భుతంగా రాణిస్తున్నారు. రషీద్ ఖాన్ తిరిగి ఫామ్లోకి రావడం జట్టుకు శుభసూచకం. వాషింగ్టన్ సుందర్ మిడిల్ ఓవర్లలో పొదుపుగా బౌలింగ్ చేస్తూ జట్టుకు మద్దతు అందిస్తున్నాడు.
సొంతగడ్డపై ఓడిపోయిన సన్రైజర్స్ హైదరాబాద్
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మునుపటి మ్యాచ్ లో గెలిచిన గుజరాత్ టైటాన్స్ ఉత్సాహంగా ఉంటుంది. హైదరాబాద్లో జరిగిన మ్యాచ్ లో మహ్మద్ సిరాజ్ 4-17తో విజృంభించడంతో గుజరాత్ టైటాన్స్ ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. అదే ప్రదర్శన మళ్లీ పునరావృతం అయితే సన్రైజర్స్ హైదరాబాద్ క్షీణిస్తున్న ప్లేఆఫ్ ఆశలకు దాదాపు ముగింపు పలికే అవకాశం ఉంది. ఈ సీజన్ లో సన్రైజర్స్ హైదరాబాద్ ట్రేడ్మార్క్ దూకుడు బ్యాటింగ్ శైలి కనిపించడం లేదు. ఆ జట్టు విధ్వంసక ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ ఇటీవలి మ్యాచ్ల్లో తడబడ్డారు.
ట్రావిస్ హెడ్ గత 8 ఇన్నింగ్స్ లలో కేవలం ఒక అర్థ సెంచరీ మాత్రమే సాధించగా.. అభిషేక్ గత రెండు మ్యాచ్లలో రెండంకెల స్కోరును చేరుకోలేకపోయాడు. భారీ స్కోరుకు పునాది వేస్తారని భావించిన వీరిద్దరి ఫామ్లో తగ్గుదల జట్టుకు సమస్యగా మారింది. మిడిల్ ఆర్డర్ లో బ్యాటర్లు కూడా విఫలం అవుతున్నారు. హెన్రిచ్ క్లాసెన్, నితీష్ కుమార్ రెడ్డి, ఇషాన్ కిషన్ అందరూ తమ స్థానాన్ని కనుగొనడంలో చాలా కష్టపడ్డారు, యువ అనికేత్ వర్మపై పెను భారాన్ని మిగిల్చారు. బౌలింగ్ విభాగంలో హర్షల్ పటేల్ తప్ప మరెవరూ ప్రభావం చూపకపోవడం మైనస్ గా మారింది.