IPL 2025 Rajasthan Royals: ఐపీఎల్ 2025లో భాగంగా తాజాగా జరిగిన మ్యాచులో రాజస్థాన్ రాయల్స్ ఓడింది. గుజరాత్ టైటాన్స్ గెలిచింది. రాయల్స్ జట్టు 58 పరుగుల తేడాతో పరాజయాన్ని అందుకుంది. అయితే ఓటమి బాధలో ఉన్న రాజస్థాన్ జట్టుకు.. మరో గట్టి షాక్ తగిలింది. కెప్టెన్ సంజూ శాంసన్తో పాటు ఆ జట్టు ఆటగాళ్లందరిపై భారీ జరిమానా విధించారు ఐపీఎల్ నిర్వాహకులు.
ఇంతకీ రాజస్థాన్ చేసిన తప్పేంది..
గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచులో స్లో ఓవర్ రేట్ కారణమే రాజస్థాన్ రాయల్స్ కు దెబ్బ కొట్టింది. నిర్ణీత సమయంలో రాజస్థాన్ బౌలర్లు 20 ఓవర్లను పూర్తి చేయలేక పోయారు. పైగా ఈ ఐపీఎల్ 2025 సీజన్ లో రాజస్థాన్ రాయల్స్ స్లో ఓవర్ రేట్ వేయడం ఇది రెండో సారి. అంతకుముందు చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచులోనూ ఇదే జరిగింది. అప్పుడు గాయపడిన సంజూ శాంసన్ స్థానంలో స్టాండ్ ఇన్ కెప్టెన్ గా వచ్చిన రియాన్ పరాగ్ కు రూ.12 లక్షల ఫైన్ వేశారు.

ఇది రెండో సారి..
అందుకే ఇప్పుడీ తప్పిదం రెండో సారి జరగడం వల్ల.. భారీ జరిమానా విధించారు. కెప్టెన్ సంజూ శాంసన్ కు రూ.24 లక్షల ఫైన్ వేశారు. ఇంపాక్ట్ ప్లేయర్ తో పాటు తుది జట్టులోని మిగిలిన ప్లేయర్స్ కు కూా రూ.6 లక్షలు లేదా వారి మ్యాచ్ ఫీజులో 25 శాతం ఏది తక్కువైతే ఆ జరిమానా విధించనున్నట్లు ఐపీఎల్ మీడియా ప్రకటనలో తెలిపింది. కాగా, ఈ సీజన్ లో ఐదు మ్యాచులో ఆడిన రాజస్థాన్.. మూడింటిలో ఓడింది. దీంతో పాయింట్ల పట్టికలో 4 పాయింట్లతో 7వ స్థానంలో నిలిచింది.