IPL 2025 Sanju Samson: ఐపీఎల్ 2025లో భాగంగా తాజాగా జరిగిన మ్యాచులో గుజరాత్ టైటాన్స్ అదరగొట్టింది, రాజస్థాన్ రాయల్స్ ఓడింది. 58 పరుగుల తేడాతో పరాజయాన్ని అందుకుంది. రాజస్థాన్ బ్యాటర్లలో హెట్మయర్ (32 బంతుల్లో 52; 4×4, 3×6), సంజు శాంసన్ (28 బంతుల్లో 41; 4×4, 2×6) పర్వాలేదనిపించారు. ప్రసిద్ధ్ కృష్ణ (3/24), రషీద్ ఖాన్ (2/37), సాయికిశోర్ (2/20) దెబ్బకు మిగతా వారు విఫలమవ్వడంతో 19.2 ఓవర్లలో 159 పరుగులకే రాజస్థాన్ చాప చుట్టేసింది.
ఆ ఇద్దరూ భారీగా పరుగులు..
అంతకుముందు మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ లో సాయి సుదర్శన్ (53 బంతుల్లో 82; 8×4, 3×6) మంచి స్కోర్ చేశాడు. జోస్ బట్లర్ (36), షారుక్ ఖాన్ (36), రాహుల్ తెవాతియా (24), రషీద్ ఖాన్ (12) పరుగులు చేశారు. జోఫ్రా ఆర్చర్ (1/30) వికెట్ పడగొట్టగా.. తీక్షణ, తుషార్ చెరో రెండు వికెట్లు తీసి భారీగా పరుగులు సమర్పించుకున్నారు. దీంతో
గుజరాత్ 6 వికెట్లు కోల్పోయి 217 పరుగులు చేసింది.
మ్యాచ్ మలుపు అక్కడే..
మ్యాచ్ అనంతరం తన ఓటమిపై స్పందించాడు కెప్టెన్ సంజు శాంసన్. అతడు మాట్లాడుతూ.. "బౌలింగ్లో మేము దాదాపు 15 నుంచి 20 పరుగులు ఎక్కువగా ఇచ్చేశాం. మేము మ్యాచును మా వైపునకు తిప్పే ప్రయత్నం చేసినప్పుడల్లా ప్రతిసారీ వికెట్లను కోల్పోయాం. నేను, హెట్మయర్ కలిసి బ్యాటింగ్ చేసినప్పుడు మ్యాచ్ మా అందుబాటులోనే ఉంది. కానీ నా వికెట్ పడ్డాకే గేమ్ మలుపు తిరిగిపోయింది. పిచ్ నుంచి కాస్త సహకారం లభించింది. జోఫ్రా ఆర్చర్ వేసిన బంతులు చూస్తే అది స్పష్టంగా కనిపించింది. ముఖ్యంగా గిల్ వికెట్ తీసిన విధానం చూస్తే అర్థమవుతుంది. కానీ చివరి ఓవర్లలో మా బౌలింగ్ తీరు ఆశించిన స్థాయిలో లేదు. మేము దీనిపై చర్చించి సరిచేసుకోవాల్సిన అవసరం ఉంది. ఓటములు ఎదురైనప్పుడు ముందుగా బ్యాటింగ్ చేయాల్సిందా లేదా ఛేజ్ చేయాల్సిందా అన్నది కూడా ఆలోచిస్తాం. ఇది మంచి పిచ్. ఈ పరిస్థితులను గౌరవిస్తూ, ఛేదనలో గెలిచే సామర్థ్యం ఉన్న జట్టుగా మమ్మల్ని మేము మలచుకోవాలనుకుంటున్నాం," అని శాంసన్ అన్నాడు.
