ఐపీఎల్-2024లో మరో సమరానికి రంగం సిద్ధమైంది. సొంత మైదానంలో చిన్నస్వామి స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనుంది. ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే ఇరు జట్లకు ఈ మ్యాచ్ ఎంతో కీలకం. పాయింట్ల పట్టికలో గుజరాత్ ఎనిమిదో స్థానంలో, ఆర్సీబీ అట్టడుగన ఉంది.
తదుపరి దశకు చేరుకోవడానికి బెంగళూరుకు అవకాశాలు తక్కువగా ఉన్నప్పటికీ సాంకేతికంగా పోటీలోనే ఉంది. దీంతో గుజరాత్పై నెగ్గి ఆశలను సజీవంగా ఉంచుకోవాలని ఆర్సీబీ భావిస్తోంది. మరోవైపు గత మ్యాచ్లో ఆర్సీబీ చేతిలో తొమ్మిది వికెట్లతో ఘోర పరాజయాన్ని చవిచూసిన గుజరాత్ టైటాన్స్ ఈ మ్యాచ్లో గెలిచి ప్రతీకారం తీర్చుకోవాలని పట్టుదలతో రంగంలోకి దిగుతోంది.

కాగా, టాస్ గెలిచిన ఆర్సీబీ కెప్టెన్ డుప్లెసిస్ బౌలింగ్ ఎంచుకున్నాడు. తమ జట్టు జోరు మీద ఉందని, స్వేచ్ఛగా బ్యాటింగ్ చేస్తామని డుప్లెసిస్ అన్నాడు. ''మేం ఛేజింగ్ చేయాలనుకుంటున్నాం. గత కొన్ని మ్యాచ్ల నుంచి మేం చక్కని ప్రదర్శనతో సత్తాచాటడం ఎంతో ఆనందంగా ఉంది. గత మ్యాచ్లో ఆడిన తుది జట్టునే కొనసాగించాలనుకుంటున్నాం'' అని డుప్లెసిస్ తెలిపాడు.
మరోవైపు గుజరాత్ కెప్టెన్ శుభ్మన్ గిల్ మాట్లాడుతూ.. జట్టులో రెండు మార్పులు చోటుచేసుకున్నాయని చెప్పాడు. ఇవాళ జోస్ లిటిల్, కుర్రాడు మనవ్ సుతార్ ఆడనున్నారని తెలిపాడు. ''అత్యుత్తమ ఆటను ప్రదర్శించడం మాకెంతో ముఖ్యం. బౌలింగ్, బ్యాటింగ్ కంటే కీలక సమయాల్లో ఫీల్డింగ్లో తడబడుతున్నామనిపిస్తోంది. ఇవాళ మెరుగైన ప్రదర్శన చేయాలని భావిస్తున్నాం. జోస్ లిటిల్ జట్టులోకి వచ్చాడు. మనవ్ సుతార్ అరంగేట్రం చేయనున్నాడు. సాయి కిశోర్ జట్టులో లేడు'' అని గిల్ అన్నాడు.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తుది జట్టు:
విరాట్ కోహ్లి, డుప్లెసిస్ (కెప్టెన్), విల్ జాక్స్, రజత్ పటిదార్, గ్లెన్ మాక్స్వెల్, కామెరూన్ గ్రీన్, దినేశ్ కార్తీక్, స్వప్నిల్ సింగ్, కర్ణ్ శర్మ, మహ్మద్ సిరాజ్, యశ్ దయాల్
గుజరాత్ టైటాన్స్ తుది జట్టు:
వృద్ధిమాన్ సాహా, శుభ్మన్ గిల్ (కెప్టెన్), సాయి సుదర్శన్, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాతియా, షారుక్ ఖాన్, రషీద్ ఖాన్, మనవ్ సుతార్, నూర్ అహ్మద్, జోస్ లిటిల్, మోహిత్ శర్మ