రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అదరగొట్టింది. డబుల్ హ్యాట్రిక్ ఓటముల తర్వాత గెలుపు బాట పట్టిన ఆర్సీబీ వరుసగా రెండో విజయం సాధించింది. అహ్మదాబాద్ వేదికగా ఆదివారం గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో తొమ్మిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. పాయింట్ల పట్టికలో అట్టడుగున కొనసాగుతున్నప్పటికీ ఈ గెలుపు ఆర్సీబీ శిబిరంలో ఆత్మవిశ్వాసం నింపింది.
మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లకు 200 పరుగులు చేసింది. సాయి సుదర్శన్ (84*; 49 బంతుల్లో, 8x4, 4x6), షారుక్ ఖాన్ (58; 30 బంతుల్లో, 3x4, 5x6) అర్ధశతకాలు సాధించారు. ఆర్సీబీ బౌలర్లలో స్వప్నిల్ (1/23), మాక్స్వెల్ (1/28), సిరాజ్ (1/34) తలో వికెట్ తీశారు.

అనంతరం ఛేదనలో బెంగళూరు ఒక్క వికెట్ కోల్పోయి 16 ఓవర్లలో విజయం సాధించింది. విల్ జాక్స్ (100*, 41 బంతుల్లో, 5x4, 10x6) అజేయ మెరుపు శతకం సాధించాడు. అతడికి తోడుగా విరాట్ కోహ్లి (70*; 44 బంతుల్లో, 6x4, 3x6) విధ్వంసం సృష్టించాడు. డుప్లెసిస్ (24; 12 బంతుల్లో, 1x4, 3x6) ఆకట్టుకున్నాడు. జాక్స్ తాను ఎదుర్కొన్న చివరి 24 బంతుల్లో 83 పరుగులు చేయడం విశేషం. 31 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించిన జాక్స్ 41 బంతుల్లో సెంచరీ బాదేశాడు.
కాగా, మ్యాచ్ అనంతరం ఓటమికి గల కారణాలను గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్మన్ గిల్ వివరించాడు. విల్ జాక్స్, విరాట్ కోహ్లి అద్భుతమైన బ్యాటింగ్ వల్ల మ్యాచ్ చేజారిందని తెలిపాడు. తొలుత 200 స్కోరు సరిపోతుందని భావించామని గిల్ పేర్కొన్నాడు. ''కోహ్లి-జాక్స్ అద్భుతంగా హిట్టింగ్ చేశారు. వచ్చే మ్యాచ్లో మెరుగైన ప్రణాళికలతో బరిలోకి దిగుతాం. అంతేగాక మా వ్యూహాలను అమలు చేసేలా ప్రయత్నిస్తాం''
''బ్యాటింగ్ చేసిన ప్రతిసారి మరో 15-20 పరుగులు అదనంగా సాధిస్తే బాగుంటుందనిపిస్తుంది. 200 స్కోరు సరిపోతుందని భావించాం. కానీ దురదృష్టవశాత్తు మేం ఆశించిన ఫలితం రాలేదు. మిడిల్ ఓవర్లలో వికెట్లను సాధించలేకపోయాం. ఇది మ్యాచ్ను మా నుంచి దూరం చేసిందని భావిస్తున్నా'' అని గిల్ పేర్కొన్నాడు.