ఐపీఎల్ 2025లో భాగంగా తాజాగా జరిగిన మ్యాచులో గుజరాత్ టైటాన్స్ పై పంజాబ్ కింగ్స్ విజయం సాధించింది. ఈ విజయంలో కీలకంగా వ్యవహరించిన శ్రేయస్ అయ్యర్ (42 బంతుల్లో 5×4, 9×6 పరుగుల సాయంతో 97 నాటౌట్) విధంసకర కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. అయితే మూడో స్థానంలో దిగి మెరుపులు మెరిపించిన శ్రేయస్ అయ్యర్.. జట్టు కోసం ఓ త్యాగం చేసి అభిమానుల ప్రశంసలను అందుకుంటున్నాడు. అతడు చేసిన త్యాగం గురించి.. ఇదే మ్యాచు విజయంలో కీలకంగా వ్యవహరించిన మరో ప్లేయర్ శశాంక్ వివరించాడు. శ్రేయస్ అయ్యర్ పై ప్రశంసలు కురిపించాడు.
17 ఓవర్లకు 90...
వాస్తవానికి శ్రేయస్ అయ్యర్ ఈ మ్యాచులో శతకాన్ని బాదుతాడని క్రికెట్ అభిమానులంతా ఆశించారు. కానీ అతడు మాత్రం తన తొలి ఐపీఎల్ సెంచరీని మాత్రం అందుకోలేకపోయాడు. అందుకు కారణం.. ఆఖరి ఓవర్ మొత్తం శశాంక్ ఆడటమే. అయితే క్రీజులో ధనాధన్ బ్యాటింగ్ చేసిన శ్రేయస్.. 16 ఓవర్లు పూర్తయ్యే సమయానికి 66 పరుగులపైగా చేశాడు. ముఖ్యంగా తర్వాతి ఓవర్లో మరింత చెలరేగి ఆడాడు. వరుసగా 6, 4, 6, 6, 2 కుమ్మేశాడు. దీంతో అతడి స్కోరు 90 పరుగులకు వచ్చేసింది.
3 పరుగుల దూరంలో..
మ్యాచులో ఇంకా 3 ఓవర్లు మిగిలి ఉండండతో శ్రేయస్ అయ్యర్ సెంచరీ చేయడం పక్కానే అని అందరూ భావించారు. కానీ అతడు మాత్రం ఆ తర్వాతి 18,19 ఓవర్లలో మూడు బంతులే ఎదుర్కొని 7 పరుగులు చేశాడు. శశాంక్ ఎక్కువగా స్ట్రైకింగ్ బాధ్యత తీసుకుని భారీ షాట్లు ఆడడంతో ఆఖరి ఓవర్లో శ్రేయస్కు ఒక్క బంతీ కూడా ఆడే అవకాశం రాలేదు. దీంతో శ్రేయస్.. సెంచరీకి 3 పరుగుల దూరంలో నిలిచిపోయాడు.
నిస్వార్థంగా ఆలోచించాడు..
అయితే మ్యాచ్ అనంతరం.. శ్రేయస్ సెంచరీని ఎందుకు వదిలేశాడో శశాంక్ వివరించాడు. స్టైక్ ఆడతావా అని నేను వెళ్లి శ్రేయస్ అయ్యర్ ను అడగబోయాను. కానీ ముందే అతడు వచ్చి నా సెంచరీ గురించి ఆలోచించొద్దు. ప్రతీ బంతిని బాదేయ్. ఏం ఆలోచించకుండా దూకుడుగా ఆడు. ఇది టీమ్ గేమ్ అన్నాడు. కానీ అలాంటి సమయంలో (సెంచరీకి చేరువలో) నిస్వార్థంగా ఉండటం చాలా కష్టం. శ్రేయస్ అదే చేశాడు. ఐపీఎల్ లో సెంచరీ చేయడం అంత ఈజీ కాదు. అతడి మాటలు నాలో ఎంతో స్ఫూర్తినిచ్చాయి. అని పేర్కొన్నాడు. కాగా, శశాంక్ 16 బంతుల్లోనే 2 సిక్స్లు, 6 ఫోర్ల సాయంతో 44 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.
