కేకేఆర్తో జరగనున్న డూ ఆర్ డై మ్యాచ్లో విజయం సాధించి ప్లేఆఫ్స్ రేసులో నిలవాలనుకున్న గుజరాత్ టైటాన్స్కు బిగ్ షాక్ తగిలింది. ప్రతికూల వాతావరణం కారణంగా ఈ మ్యాచ్ టాస్ ఇంకా వేయలేదు. వర్షం లేకపోయినప్పటికీ మెరుపులు ఎక్కువగా వస్తుండటంతో మ్యాచ్ను ప్రారంభించలేదు.
అహ్మదాబాద్ వేదికగా కోల్కతా నైట్ రైడర్స్తో గుజరాత్ టైటాన్స్ ఇవాళ తలపడనున్న విషయం తెలిసిందే. ప్లేఆఫ్స్ ఆశలు సజీవంగా ఉంచుకోవాలంటే ఈ మ్యాచ్లో గుజరాత్ తప్పక విజయం సాధించాలి. ఈ సీజన్లో ఇప్పటివరకు 12 మ్యాచ్లు ఆడిన గుజరాత్ అయిదు విజయాలతో పది పాయింట్లు సాధించింది. పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో కొనసాగుతుంది.

అయితే మ్యాచ్కు ప్రతికూల వాతావరణం అంతరాయం కలిగించింది. షెడ్యూల్ ప్రకారం రాత్రి 7 గంటలకు టాస్ వేయాలి. కానీ వర్షం లేకపోయినప్పటికీ పిచ్ను కవర్లతో కప్పి ఉంచారు. మెరుపులు విపరీతంగా వస్తుండటంతో ముందు జాగ్రత్తగా కవర్లు కప్పిఉంచారు. అయితే కాసేపటికీ కవర్లను తీసేశారు. కానీ ఫ్లడ్ లైట్లు వేయలేదు. మళ్లీ తిరిగి కవర్లను తీసుకువచ్చారు. ఒకవేళ మ్యాచ్ రద్దు అయితే గుజరాత్ ఇంటిముఖం పట్టాల్సిందే.
ఎందుకంటే మ్యాచ్ను రద్దు చేస్తే ఇరు జట్లకు చెరో పాయింట్ ఇస్తారు. దీంతో గుజరాత్ ఖాతాలో 11 పాయింట్లు అవుతాయి. ఆ తర్వాత సన్రైజర్స్ హైదరాబాద్తో జరగనున్న మ్యాచ్లో గుజరాత్ గెలిచినా గరిష్టంగా 13 పాయింట్లే సాధిస్తుంది. ఇప్పటికే 13 పాయింట్ల కంటే అధికంగా నాలుగు టీమ్స్ పాయింట్లు సాధించాయి.
కోల్కతా 18, రాజస్థాన్ 16, సీఎస్కే 14, హైదరాబాద్ 14 పాయింట్లతో నిలిచాయి. గుజరాత్ ఈ పాయింట్లను అధిగమించడం అసంభవం. దీంతో ఐపీఎల్ 2024 సీజన్లో నాకౌటైన మూడో జట్టుగా గుజరాత్ టైటాన్స్ నిలుస్తుంది. ఇప్పటికే ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ టోర్నీ నుంచి వైదొలిగిన విషయం తెలిసిందే.
తుది జట్లు అంచనా
గుజరాత్ టైటాన్స్:శుభ్మన్ గిల్ (కెప్టెన్), సాయి సుదర్శన్, షారుక్ ఖాన్, డేవిడ్ మిల్లర్, మాథ్యూ వేడ్, రాహుల్ తెవాతియా, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, ఉమేశ్ యాదవ్, మోహిత్ శర్మ, కార్తీక్ త్యాగి
కోల్కతా నైట్ రైడర్స్: ఫిలిప్ సాల్ట్, సునీల్ నరైన్, వెంకటేశ్ అయ్యర్, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), రింకూ సింగ్, నితీశ్ రాణా, రసెల్, రమణ్దీప్ సింగ్, మిచెల్ స్టార్క్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి.