కోల్కతా నైట్ రైడర్స్పై గెలిచి ప్లేఆఫ్స్ ఆశలు సజీవంగా ఉంచుకోవాలనుకున్న గుజరాత్ టైటాన్స్కు వరుణుడు షాక్ ఇచ్చాడు. కనీసం టాస్ కూడా పడకుండా మ్యాచ్ రద్దైంది. ప్రతికూల వాతావరణం కారణంగా టాస్ను ఆలస్యంగా వేస్తామని తొలుత నిర్వాహకులు ప్రకటించారు. కానీ, ఆ తర్వాత వర్షం తీవ్రంగా పడింది.
అయితే రాత్రి 10.30 గంటల సమయంలో వరుణుడు కరుణించాడు. పిచ్పై నుంచి కవర్లు బయటకు తీశారు. దీంతో కనీసం అయిదు ఓవర్ల పాటు మ్యాచ్ను కొనసాగిస్తారని అందరూ భావించారు. కానీ మ్యాచ్ రిఫరీ గుజరాత్-కేకేఆర్ మ్యాచ్ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించాడు. మొత్తంగా అహ్మదాబాద్ వేదికగా జరగాల్సిన ఇవాళ మ్యాచ్ రద్దైంది.

కాగా, మ్యాచ్ రద్దు కావడంతో గుజరాత్ టైటాన్స్ అధికారికంగా టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఎలా అంటే.. రద్దు కారణంగా ఇరు జట్లకు చెరో పాయింట్ వచ్చింది. దీంతో గుజరాత్ టైటాన్స్ ఖాతాలో 11 పాయింట్లు చేరాయి. ఆ తర్వాత సన్రైజర్స్ హైదరాబాద్తో జరగనున్న మ్యాచ్లో గుజరాత్ గెలిచినా గరిష్టంగా 13 పాయింట్లే సాధిస్తుంది. ఇప్పటికే 13 పాయింట్ల కంటే అధికంగా నాలుగు టీమ్స్ పాయింట్లు సాధించాయి.

కోల్కతా 19 పాయింట్లు, రాజస్థాన్ 16, సీఎస్కే 14, హైదరాబాద్ 14 పాయింట్లతో నిలిచాయి. గుజరాత్ ఈ పాయింట్లను అధిగమించడం అసంభవం. దీంతో ఐపీఎల్ 2024 సీజన్లో నాకౌటైన మూడో జట్టుగా గుజరాత్ టైటాన్స్ నిలుస్తుంది. ఇప్పటికే ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ టోర్నీ నుంచి వైదొలిగిన విషయం తెలిసిందే.
టాప్-2లో కోల్కతా కన్ఫార్మ్
మరోవైపు 19 పాయింట్లు సాధించిన కేకేఆర్ టేబుల్ టాపర్గా కొనసాగుతోంది. అయితే కోల్కతా తన చివరి మ్యాచ్లో ఓటమిపాలైనా టాప్-2లోనే ఉంటుంది. అది ఎలా అంటే.. రాజస్థాన్ రాయల్స్ మినహా ఏ జట్టు 19 పాయింట్లను అధిగమించే అవకాశం లేదు. 12 మ్యాచ్లు ఆడి 16 పాయింట్లు సాధించిన రాజస్థాన్ మాత్రమే కేకేఆర్ పాయింట్లను దాటగలగదు. మిగిలిన రెండు మ్యాచ్ల్లో ఆర్ఆర్ గెలిస్తే 20 పాయింట్లు సాధిస్తుంది.