ఐపీఎల్-2024 సీజన్లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. అహ్మదాబాద్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్తో గుజరాత్ టైటాన్స్ తలపడనుంది. ఈ మ్యాచ్లో విజయం సాధించాలని ఇరు జట్లు కసిగా బరిలోకి దిగుతున్నాయి. ఈ పోరుతో ఇరు జట్లు ఈ సీజన్లో తమ సగం లీగ్ మ్యాచ్లు పూర్తికానున్నాయి. దీంతో ఈ అర్ధభాగాన్ని గెలుపుతో గ్రాండ్గా ఫినిష్ చేయాలని పట్టుదలతో ఉన్నాయి.
ఇప్పటివరకు ఈ సీజన్లో ఆరు మ్యాచ్లు ఆడిన గుజరాత్ టైటాన్స్ మూడు విజయాలో ఆరో స్థానంలో నిలిచింది. గత సీజన్లో రన్నరప్గా నిలిచిన గుజరాత్ అంచాలను అందుకోలేకపోతుంది. డేవిడ్ మిల్లర్ కొన్ని మ్యాచ్లకు దూరమవ్వడం ఆ జట్టుకు ప్రతికూలతగా మారింది. అయితే రాజస్థాన్ రాయల్స్పై థ్రిల్లింగ్ విక్టరీ సాధించిన ఉత్సాహం, మిల్లర్ రీఎంట్రీతో ఇవాళ మ్యాచ్లోనూ గెలవాలని గుజరాత్ భావిస్తోంది.

మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ ఈ సీజన్లో ఆరు మ్యాచ్లు ఆడి రెండు విజయాలు మాత్రమే సాధించింది. పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో ఉంది. ప్లేఆఫ్స్ ఆశలు సజీవంగా ఉంచుకోవాలంటే ఢిల్లీకి విజయం తప్పనిసరి. కాగా, టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ రిషభ్ పంత్ బౌలింగ్ ఎంచుకున్నాడు. పిచ్ ఎలా సహకరిస్తుందో ఎవరికీ తెలియదని, అయితే తమ బ్యాటింగ్ ఆర్డర్ స్ట్రాంగ్గా ఉండటంతో లక్ష్యాన్ని ఛేదింగలమని తొలుత బౌలింగ్ సెలక్ట్ చేసుకున్నట్లు పంత్ తెలిపాడు. డేవిడ్ వార్నర్ స్థానంలో సుమిత్ కుమార్ తీసుకున్నామని పంత్ పేర్కొన్నాడు.
గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్మన్ గిల్ మాట్లాడుతూ.. టాస్ గెలిస్తే తాము కూడా బౌలింగ్ తీసుకునేవాళ్లమని వివరించాడు. జట్టులో మూడు మార్పులు చేశామని తెలిపాడు. వృద్ధిమాన్ సాహా, డేవిడ్ మిల్లర్ తిరిగి జట్టులోకి వచ్చారని గిల్ పేర్కొన్నాడు. సందీప్ వారియర్కు అవకాశం ఇచ్చామని అన్నాడు.
తుది జట్లు
గుజరాత్ టైటాన్స్: శుభ్మన్ గిల్ (కెప్టెన్), వృద్ధిమాన్ సాహా, సాయి సుదర్శన్, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాతియా, అభినవ్ మనోహర్, రషీద్ ఖాన్, మోహిత్ శర్మ, నూర్ అహ్మద్, స్పెన్సర్ జాన్సన్, సందీప్ వారియర్.
ఢిల్లీ క్యాపిటల్స్: పృథ్వీ షా, జేక్ ఫ్రేజర్ మెక్గర్క్, సుమిత్ కుమార్, రిషభ్ పంత్ (కెప్టెన్), షై హోప్, ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, ముకేశ్ కుమార్, ఖలీల్ అహ్మద్, ఇషాంత్ శర్మ.