GT vs DC: ఐపీఎల్ 2025లో 35వ మ్యాచ్ అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ క్రికెట్ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్మన్ గిల్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ తరపున ఆడుతున్న పేసర్ ఇషాంత్ శర్మ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఇషాంత్ తన 3 ఓవర్ల స్పెల్ లో 19 పరుగులిచ్చి డోనోవన్ ఫెరీరా వికెట్ తీసుకున్నాడు. అయితే ఈ మ్యాచ్ సమయంలో ఇషాంత్ శర్మ ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు అశుతోష్ శర్మతో వాగ్వాదానికి దిగాడు.
మ్యాచ్ లో ఇషాంత్, అశుతోష్ గొడవపడ్డారు..
నిజానికి ఇదంతా ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్ లో 19వ ఓవర్ సమయంలో జరిగింది. ఈ ఓవర్ను గుజరాత్ టైటాన్స్ పేసర్ ఇషాంత్ శర్మ బౌలింగ్ చేశాడు. అశుతోష్ శర్మ తన ఓవర్ చివరి బంతికి స్ట్రైక్లో ఉన్నాడు. ఇషాంత్ అశుతోష్ కు షార్ట్ బాల్ వేశాడు. ఈ బంతి అశుతోష్ భుజానికి తగిలి వికెట్ కీపర్ వద్దకు వెళ్లింది. అయితే ఇషాంత్, గుజరాత్ జట్టు క్యాచ్ ఔట్ కోసం అప్పీల్ చేశారు. కానీ అంపైర్ ఔట్ ఇవ్వలేదు. బంతి తగిలిన తర్వాత అశుతోష్ పరుగు తీశాడు. అంపైర్ లెగ్ బైగా ఒక పరుగు ఇచ్చాడు.

అశుతోష్ శర్మ బౌలింగ్ ఎండ్ కు చేరుకున్నప్పుడు అతనికి, ఇషాంత్ శర్మకు మధ్య చిన్న వాదన జరిగింది. ఇద్దరూ ఒకరితో ఒకరు ఏదో మాట్లాడుకుంటూ కనిపించారు. అయితే వారిద్దరూ ఏమి మాట్లాడుకున్నారో తెలియదు. కానీ ఇషాంత్కు అశుతోష్పై ఏదో కోపం వచ్చినట్లు అనిపించింది. 19వ ఓవర్లో ఇషాంత్ శర్మ కేవలం 6 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఆ ఓవర్ వేసిన తర్వాత ఇషాంత్ శర్మ మైదానం నుంచి బయటకు వెళ్లిపోయాడు.
మ్యాచ్ గురించి చెప్పాలంటే, టాస్ ఓడిన తర్వాత మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ 8 వికెట్లకు 203 పరుగులు చేసింది. గుజరాత్ కు ఢిల్లీ 204 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.