ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన డూ ఆర్ డై మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ ఓపెనర్లు శుభ్మన్ గిల్ (104; 55 బంతుల్లో, 9x4, 6x6), సాయి సుదర్శన్ (103; 51 బంతుల్లో, 5x4, 7x6) విధ్వంసం సృష్టించారు. శతకాలతో విరుచుకుపడి చెన్నై సూపర్ కింగ్స్కు 232 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించారు.
అహ్మదాబాద్ వేదికగా శుక్రవారం సీఎస్కేతో జరుగుతున్న మ్యాచ్లో గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 231 పరుగులు చేసింది. గిల్, సుదర్శన్ మొదటి వికెట్కు ద్విశతక (210) భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగుల భాగస్వామ్యం నమోదు చేసిన మూడో జోడీగా గిల్-సుదర్శన్ రికార్డు సాధించారు.

అత్యధిక పరుగుల భాగస్వామ్య జాబితాలో ఏబీ డివిలియర్స్-విరాట్ కోహ్లి (229), ఏబీ డివిలియర్స్-విరాట్ కోహ్లి (215*), డికాక్-కేఎల్ రాహుల్ (210*) టాప్-3లో ఉన్నారు. కాగా, శుభ్మన్ గిల్తో పోటాపోటీగా శతకం బాదిన సాయి సుదర్శన్ ఆదిలో నిలకడగా ఆడాడు. పవర్ప్లేలో 23 బంతుల్లో 28 పరుగులే చేసిన అతను 32 బంతుల్లో అర్ధశతకం సాధించారు.
అయితే హాఫ్ సెంచరీ అనంతరం సుదర్శన్ టాప్ గేర్లోకి దూసుకెళ్లాడు. 50 బంతుల్లోనే శతకం సాధించాడు. ఈ క్రమంలో తన ఐపీఎల్ కెరీర్లో వెయ్యి పరుగుల మైలురాయిని అందుకున్న సుదర్శన్ అరుదైన రికార్డు నెలకొల్పాడు. ఐపీఎల్లో ఇన్నింగ్స్ పరంగా వేగంగా 1000 పరుగులు సాధించిన భారత ప్లేయర్గా సాయి సుదర్శన్ చరిత్రకెక్కాడు. అంతకుముందు ఈ రికార్డు సచిన్ టెండూల్కర్-రుతురాజ్ గైక్వాడ్ పేరిట ఉమ్మడిగా ఉంది.
సాయి సుదర్శన్ 25 ఇన్నింగ్స్ల్లో 1000 పరుగులు సాధించాడు. సచిన్, రుతురాజ్ 31 ఇన్నింగ్స్ల్లో, తిలక్ వర్మ 33 ఇన్నింగ్స్లో ఈ మార్క్ను అందుకున్నారు. ఓవరాల్గా ఐపీఎల్లో వేగంగా వెయ్యి పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో మాథ్యూ హెడెన్తో కలిసి సుదర్శన్ మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. షాన్ మార్ష్ (21), సైమన్స్ (23) టాప్-2లో ఉన్నారు.