ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన డూ ఆర్ డై మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ పంజా విసిరింది. అహ్మదాబాద్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన పోరులో 35 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో ప్లేఆఫ్స్ అశలను గుజరాత్ సజీవంగా ఉంచుకుంది. మరోవైపు సీఎస్కే టాప్-4లోనే కొనసాగుతున్నప్పటికీ తదుపరి దశకు చేరుకోవడానికి అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది.
మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లకు 231 పరుగులు చేసింది. ఓపెనర్లు శుభ్మన్ గిల్ (104; 55 బంతుల్లో, 9x4, 6x6), సాయి సుదర్శన్ (103; 51 బంతుల్లో, 5x4, 7x6) శతకాలతో విరుచుకుపడ్డారు. వీరిద్దరు తొలి వికెట్కు 210 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. చెన్నై బౌలర్లలో తుషార్ (2/33) రెండు వికెట్లు తీశాడు.

అనంతరం ఛేదనకు దిగిన సీఎస్కే 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లకు 196 పరుగులు చేసింది. డారిల్ మిచెల్ (63; 34 బంతుల్లో, 7x4, 3x6), మొయిన్ అలీ (56; 36 బంతుల్లో, 4x4, 4x6) అర్ధశతకాలతో పోరాడారు. గుజరాత్ టైటాన్స్ బౌలర్లలో మోహిత్ శర్మ (3/31) మూడు, రషీద్ ఖాన్ (2/38) రెండు వికెట్లతో సత్తాచాటారు.
కాగా, స్లో ఓవర్ రేట్ కారణంగా గుజరాత్ కెప్టెన్ శుభ్మన్ గిల్కు బీసీసీఐ రూ.24 లక్షల భారీ జరిమానా విధించింది. అంతేగాక గుజరాత్ జట్టులోని ప్లేయర్లందరికీ రూ. 6 లక్షలు లేదా మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత పెట్టింది. ఇంపాక్ట్ ప్లేయర్కు కూడా ఈ ఫైన్ వేసింది. స్లో ఓవర్ రేట్ కారణంగా గిల్ జరిమానాకు గురికావడం ఈ సీజన్లో రెండోసారి.
అయితే సీఎస్కే ఛేజింగ్లో గిల్ గుజరాత్ జట్టును నడిపించలేదు. 18 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసిన గిల్ తిమ్మిర్లతో ఇబ్బంది పడ్డాడు.దీంతో గిల్ డగౌట్లోనే కూర్చొన్నాడు. మరోవైపు గిల్ స్థానంలో రాహుల్ తెవాతియా జట్టు బాధ్యతలు అందుకున్నాడు. తెవాతియానే జట్టును విజయతీరాలకు చేర్చాడు. కానీ స్లోఓవర్ రేటు కారణంగా గిల్కు జరిమానా విధించడం గమనార్హం.