ఐపీఎల్-2024లో మరో ఆసక్తికర పోరు రంగం సిద్ధమైంది. సొంతమైదానంలో అహ్మదాబాద్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్తో గుజరాత్ టైటాన్స్ తలపడనుంది. గుజరాత్కు ఇది డూ ఆర్ డై మ్యాచ్. ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే గుజరాత్ తప్పక విజయం సాధించాలి. ఈ పోరులో ఓడితే టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది.
ఈ సీజన్లో ఇప్పటివరకు 11 మ్యాచ్లు ఆడిన గుజరాత్ కేవలం నాలుగు విజయాలే సాధించింది. ఎనిమిది పాయింట్లతో పట్టికలో అట్టడుగన నిలిచింది. ఈ దశ నుంచి ప్లేఆఫ్స్కు చేరుకోవడం గుజరాత్కు అసాధ్యమైనప్పటికీ సాంకేతికంగా పోటీలోనే ఉంది. కానీ సీఎస్కే చేతిలో ఓడితే ప్లేఆఫ్స్ రేసు నుంచి ఔట్ అవుతుంది.

మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్కు ఈ మ్యాచ్ ఎంతో కీలకమే. 11 మ్యాచ్లు ఆడిన సీఎస్కే ఆరింట్లో గెలిచి 12 పాయింట్లతో పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. చెన్నై టాప్-4లో ఉన్నప్పటికీ తదుపరి దశకు చేరుకుంటుందని నమ్మకంగా చెప్పలేని పరిస్థితి. ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ కూడా 12 పాయింట్లతో అయిదు, ఆరో స్థానంలో వరుసగా ఉన్నాయి.
ఈ నేపథ్యంలో ఇవాళ పోరులో విజయం సాధించి ప్లేఆఫ్స్ అవకాశాలు మెరుగుపర్చుకోవాలని ఇరు జట్లు పట్టుదలతో బరిలోకి దిగుతున్నాయి. పిచ్ బ్యాటింగ్కు అనుకూలించనుంది. ఇన్నింగ్స్ ఆరంభంలో బంతి స్వింగ్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంది. కాగా, టాస్ గెలిచిన సీఎస్కే బౌలింగ్ ఎంచుకుంది. అనంతరం చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మాట్లాడాడు. తుదిజట్టులో అజింక్య రహానె లేడని, గ్లీసన్ స్థానంలో రచిన్ రవీంద్రను తీసుకున్నామని చెప్పాడు.
''వికెట్ బాగుంది. ఇది ఛేజింగ్ గ్రౌండ్. కాబట్టి మేం తొలుత బౌలింగ్ చేస్తాం. చెన్నై తరహాలోనే ఇక్కడ ఉంది. ఎరుపు మట్టి వికెట్ను మేం అంతగా ఇష్టపడం. ఇక ఐపీఎల్లో కొన్ని మ్యాచ్ల్లో ఓడిపోతుంటాం. ప్రతిఒక్క ప్లేయర్కు మద్దతు ఇస్తూ వాళ్లను ప్రోత్సహించాలి. మా జట్టులో ఎంతో మంది ఆటగాళ్లకు గాయాలయ్యాయి. కానీ మొత్తంగా బాగానే ఉన్నాం. గ్లీసన్ స్థానంలో రచిన్ రవీంద్ర తుదిజట్టులోకి వచ్చాడు'' అని రుతురాజ్ గైక్వాడ్ అన్నాడు. మరోవైపు గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ గిల్ మాట్లాడుతూ.. సాహా స్థానంలో మాథ్యూ వేడ్, జోష్ లిటిల్ స్థానంలో కార్తీక్ త్యాగీ అరంగేట్రం చేస్తున్నాడని చెప్పాడు.
తుది జట్లు
గుజరాత్ టైటాన్స్: మాథ్యూ వేడ్, శుభ్మన్ గిల్ (కెప్టెన్), సాయి సుదర్శన్, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాతియా, షారుక్ ఖాన్, రషీద్ ఖాన్, ఉమేశ్ యాదవ్, నూర్ అహ్మద్, మోహిత్ శర్మ, కార్తీక్ త్యాగి
చెన్నై సూపర్ కింగ్స్: రచిన్ రవీంద్ర, రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), డారిల్ మిచెల్, శివమ్ దూబె, మొయిన్ అలీ, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోనీ, మిచెల్ శాంట్నర్, శార్దూల్ ఠాకూర్, సిమర్జిత్ సింగ్, తుషార్ దేశ్పాండే.